నా భర్తను ఏం చేశారు..? పాపం.. ఈ తల్లి కష్టం ఎవరికీ రాకూడదు

by  |
నా భర్తను ఏం చేశారు..? పాపం.. ఈ తల్లి కష్టం ఎవరికీ రాకూడదు
X

దిశ, కొత్తగూడెం : భద్రాద్రి కొత్తకూడెం జిల్లా లక్ష్మీదేవి పల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఓ దివ్యాంగ మహిళకు తీరని అన్యాయం జరిగింది. నమ్మించి మోసం చేసి తనను రెండో పెళ్లి చేసుకున్న భర్త ఉన్నట్టుండి కనిపించకుండా పోయాడు. దీంతో తన భర్తను చూపించాలని కోరుతూ పిల్లలతో కలిసి ఆ తల్లి అత్తింటి ఎదుట బుధవారం ఆందోళనకు దిగింది.

వివరాల్లోకివెళితే.. లక్ష్మీదేవిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో నివాసముంటున్న నూరుద్దీన్ అనే దివ్యాంగ మహిళను గాజులరాజం బస్తీ 24వ వార్డుకు చెందిన బోలేష అనే వ్యక్తి ప్రేమిస్తున్నానని మోసం చేసి రెండో పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు ఆడ పిల్లలకు జన్మనిచ్చిన అతను వారి మంచి చెడులను పట్టించుకోకుండా గత రెండేళ్లుగా అనేక ఇబ్బదులకు గురి చేశాడు. చివరగా ఐదు నెలలు నుంచి కనిపించకుండా పోయాడు. ఫోన్ చేసినా రెస్పాండ్ అవ్వడం లేదు. ఈ విషయమై బోలేష కుటుంబ సభ్యులను నూరుద్దీన్ ప్రశ్నించగా.. తమకు తెలీదని వారు సమాధానం ఇచ్చారు. తన భర్తను అతని అన్నలే ఆస్తి విషయంలో కనిపించకుండా చేశారని ఆమె ఆరోపించింది.

అసలు తన భర్త బతికి ఉన్నాడో లేక చనిపోయాడో ఎదో ఒక విషయం చెప్పాలంటూ పిల్లలతో కలిసి ఆమె అత్తింటి ఎదుట బైఠాయించి నిరసన తెలిపింది. బాధిత మహిళకు టీవీపీఎస్ వ్యవస్థాపకుడు గుండపునేని సతీష్, ఇబ్రహీం, నాగేశ్వరరావు మరియు అంబేద్కర్ మహిళ సంఘం నాయకురాళ్లు మాట్ల గాయత్రి, కెడెం కృపవేణి, నక్క సృజన, మెరుగు అనసూర్య, ఒంగురు రేణుక, సత్యమ్మ తదితరులు మద్దతు తెలిపారు.

ఈ సందర్భంగా గుండపునేని సతీష్ మాట్లాడుతూ.. ఒక దివ్యాంగ మహిళను వంచించి మోసం చేయడమే కాకుండా, ఐదు నెలలుగా కనిపించకుండా పోవడంపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఎలాగైనా ఆమె భర్త బోలేష ఎక్కడ ఉన్నాడో.. అసలు ఉన్నాడో లేడో చెప్పాలి అంటూ డిమాండ్ చేశారు. అతన్ని పట్టుకు వచ్చేదాకా ఊరుకునేది లేదని బాధిత మహిళకు, ఆమెకు పుట్టిన ఇద్దరు ఆడ పిల్లలకు న్యాయం జరిగేదాక పోరాడతామని తెలియజేశారు.


Next Story

Most Viewed