సెకండ్ వేవ్ తగ్గుముఖం..  థర్డ్ వేవ్ కోసం సన్నాహాక చర్యలు

by  |
సెకండ్ వేవ్ తగ్గుముఖం..   థర్డ్ వేవ్ కోసం సన్నాహాక చర్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టినా థర్డ్ వేవ్ రానున్నదనే నిపుణుల సూచనల మేరకు రాష్ట్రంలో పూర్తిస్థాయిలో ముందస్తు చర్యలు చేపట్టాలని, తగిన మౌలిక వసతులను సమకూర్చుకోవాలని, అవసరమైన వైద్య సిబ్బందిని నియమించుకోవాలని, చికిత్సకు ఉపయోగపడే ఔషధాలను సిద్ధంగా ఉంచుకోవాలని కేబినెట్ ఆదేశించింది. థర్డ్ వేవ్ సన్నాహక చర్యలపై ఇప్పటి నుంచే మొదలుపెట్టాలని వైద్యారోగ్య శాఖకు సూచించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో మంగళవారం జరిగిన కేబినెట్ సమావేశంలో వైద్యారోగ్య శాఖకు సంబంధించిన పలు అంశాలపై చర్చించి విధాన నిర్ణయాలు తీసుకున్నది.

సత్తుపల్లి, మధిర పట్టణాల్లో 100 పడకలతో కొత్త దవాఖానలను నిర్మించాలని, ప్రస్తుతం వినియోగిస్తున్న ఆస్పత్రులను మాతా శిశు సంరక్షణ కేంద్రాలుగా వినియోగించుకోవాలని కేబినెట్ నిర్ణయించింది. సూర్యాపేటలో ప్రస్తుతం ఉన్న 50 పడకల మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని 200 పడకలకు పెంచాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని అన్ని స్థాయిల్లోని దవాఖానాలకు వచ్చే రోగులతో పాటు సహాయకులు కూడా వస్తున్నందున వారి కోసం వసతి కేంద్రాలను కూడా ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. తక్షణమే ఈ చర్యలను చేపట్టాలని వైద్యశాఖను ఆదేశించింది.

రెండు జిల్లాల్లో హెల్త్ ప్రొఫైల్ పైలట్ ప్రాజెక్టు

రాష్ట్ర ప్రభుత్వం దీర్ఘకాలంగా హెల్త్ ప్రొఫైల్‌పై దృష్టి పెట్టింది. పకడ్బందీ రోడ్ మ్యాప్ తయారైనా ఇప్పటికీ అమలులోకి రాలేదు. కరోనా ఫస్ట్, సెకండ్ వేవ్‌లలో ఎదుర్కొన్న ఇబ్బందులు, ఇంటింటి సర్వే ద్వార వస్తున్న ఫలితాలను దృష్టిలో పెట్టుకుని వెంటనే హెల్త్ ప్రొఫైల్‌ను గాడిలో పెట్టాలని నిర్ణయించింది. ప్రయోగాత్మకంగా దీన్ని తొలుత సిరిసిల్ల, ములుగు జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించాలని కేబినెట్ ఈ సమావేశంలో నిర్ణయించింది. రాష్ట్రంలోని 19 జిల్లాల్లో బుధవారం నుంచి ప్రారంభించబోతున్న 19 డయాగ్నోస్టిక్స్ కేంద్రాలతో పాటు ఇకపైన మిగిలిన అన్ని జిల్లా కేంద్రాల్లోనూ ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది.

డయాగ్నస్టిక్ కేంద్రాల్లో ఆధునిక వైద్య పరీక్షలు

అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వం నెలకొల్పనున్న డయాగ్నస్టిక్ కేంద్రాల్లో ఈసీజీ, డిజిటల్ ఎక్స్‌రే అల్ట్రాసౌండ్, టు-డీ ఈకోతో పాటు మహిళల కాన్సర్ స్క్రీనింగ్ కోసం ‘మామోగ్రామ్’ యంత్రాలను కూడా ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఎలర్జీ జబ్బులకు చేసే నిర్ధారణ పరీక్షలు, ట్రీట్‌మెంట్ కోసం హైదరాబాద్, వరంగల్, సిద్దిపేట జిల్లాల్లో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయం జరిగింది. పెరుగుతున్న రోగుల రద్దీ రీత్యా ప్రస్తుతం రాష్ట్రంలోని డయాలసిస్ కేంద్రాలలో మరిన్ని డయాలసిస్ యంత్రాలను పెంచడంతో పాటు నూతనంగా మరిన్ని కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయం జరిగింది. కేన్సర్ రోగులకు జిల్లా కేంద్రాల్లోనే కీమో థెరపీ రేడియో థెరపీ కొరకు అవసరమైన మౌలిక వసతులతో జిల్లా కేన్సర్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అన్ని దవాఖానాల్లో అవసరాలను అందుకునే విధంగా బ్లడ్ బ్యాంకులను ఆధునీకరించి అవసరమైన మేరకు నూతన బ్లడ్ బ్యాంకులను ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది.

వరంగల్‌లో ఎయిమ్స్ తరహా ఆస్పత్రి

వైద్యానికి సంబంధించి ఆర్థోపెడిక్, న్యూరాలజీ తదితర ప్రత్యేక విభాగాలలో, మెరుగైన వైద్య సేవలకోసం కావాల్సిన మౌలిక వసతులను కల్పించి, అవసరమైన మేరకు సిబ్బందిని నియమించాలని వైద్యశాఖను కేబినెట్ ఆదేశించింది. వరంగల్‌లో ప్రస్తుతం ఉన్న జైలు ప్రదేశంలో, అత్యుత్తమంగా వైద్యసేవలందించే ఎయిమ్స్ తరహా దవఖానాను ఏర్పాటు చేసి అన్ని రకాల స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీ సేవలందించాలని కేబినెట్ నిర్ణయించింది. జైలును ఇక్కడి నుంచి ఖాళీ చేసి మరో చోటికి తరలించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకున్నది.

రాష్ట్రంలోని అన్ని ఆస్పత్రుల్లో హాస్పటల్ అడ్మిస్ట్రేషన్ కోర్సులో ఎం.డీ అభ్యసించిన అర్హులైనవారిని నియమించుకుని వారిని కేవలం హాస్పటల్ అడ్మినిస్ట్రేషన్ కోసం వినియోగించాలని కేబినెట్ నిర్ణయించింది. వైద్య సేవల్లో భాగం పంచుకునే నర్సింగ్, మిడ్ వైఫరీ కోర్సులను, లాబ్ టెక్నీషియన్ రేడియాలజీ టెక్నిషియన్ డయాలసిస్ టెక్నిషియన్ వంటి ప్రత్యేక నైపుణ్య కోర్సులను అవసరమైనంత మేరకు ప్రభుత్వ దవాఖానాల్లో వైద్యకళాశాలల్లో అందుబాటులోకి తేవాలని వైద్యశాఖను కేబినెట్ ఆదేశించింది.

మాతా శిశు సంరక్షణపై ప్రత్యేక దృష్టి

రాష్ట్రంలో మాతా శిశు సంరక్షణ కు సంబంధించిన వైద్య సేవలను మరింతగా పటిష్టపరిచాలని కేబినెట్ నిర్ణయించింది. ఇతర రోగులతో కలపకుండా తల్లీ బిడ్డలకు ప్రత్యేకంగా వైద్యసేవలందించాలని, ఆస్పత్రిలోని ప్రధాన భవనంలో కాకుండా ప్రత్యేక భవనంలో వీటిని ఏర్పాటు చేయాలని నొక్కిచెప్పింది. అలాంటి సౌకర్యం లేకనట్లయితే ప్రత్యేకంగా కొత్త భవనాలను నిర్మించి వసతులు కల్పించాలని స్పష్టం చేసింది. ఈ ప్రత్యేక భవనంలోనే హై రిస్క్ ప్రసవాల కోసం ప్రత్యేకంగా ‘మెటర్నిటీ ఐసీయూ’ లను, నవజాత శిశువుల కోసం ఎస్ఎన్‌సీయూలను ఏర్పాటు చేయాలని కేబినెట్ ఆదేశించింది. వైద్య ఆరోగ్య రంగంలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేందుకు వైద్యశాఖ అహర్నిశలు కృషి చేయాలని కెబినెట్ ఆదేశించింది. గర్భం దాల్చిన మూడో నెలనుంచి గర్భిణీలకు సమతుల పౌష్టికాహార కిట్‌ను అందించాలని నిర్ణయం జరిగింది.


Next Story

Most Viewed