123 మంది GHMC పోటీదారులకు ఎస్​ఈసీ వార్నింగ్

by  |
123 మంది GHMC పోటీదారులకు ఎస్​ఈసీ వార్నింగ్
X

దిశ, తెలంగాణ బ్యూరో : జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో123 మంది పోటీదారులు ఇంకా ఎన్నికల ఖర్చు వివరాలను ఇవ్వలేదని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్​ పార్థసారధి వెల్లడించారు. వీరందరూ ఈ నెల 18లోగా ఖర్చుల వివరాలు ఎన్నికల సంఘానికి సమర్పించాలని, లేకుంటే వారిపై వేటు పడుతుందని హెచ్చరించారు. అయితే ఈ 123 మంది అభ్యర్థుల్లో గెలిచిన వారు కూడా ఉన్నట్లు భావిస్తున్నారు. ఎస్​ఈసీ కార్యాలయంలో శుక్రవారం జీహెచ్​ఎంసీ కమిషనర్​, జోనల్​ కమిషనర్లు, ఎన్నికల వ్యయ పరిశీలకులతో పార్థసారధి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల నిర్వహణ, ఖర్చుల అంశంపై చర్చించారు.

అనంతరం ఎస్​ఈసీ పార్థసారధి మాట్లాడుతూ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్ధులు ఎన్నికల ఫలితాలు ప్రకటించిన 45 రోజుల్లో ఖర్చు వివరాలు సమర్పించాల్సి ఉందన్నారు. కానీ కొంతమంది అభ్యర్థులు నిర్లక్ష్యం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 18లోగా తమ ఎన్నికల ఖర్చు వివరాలను సమర్పించని అభ్యర్థులు మూడేండ్ల వరకు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హత కోల్పోవడంతో పాటు, గెలిచిన అభ్యర్ధి పదవి కూడా కోల్పోతారని పార్థసారధి హెచ్చరించారు. ఎన్నికల ఖర్చు వివరాలు సమర్పించని అభ్యర్ధులకు మరోసారి తెలుపాలని, వారికి నోటీసులు జారీచేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. గ్రేటర్​లో మొత్తం పోటీచేసిన 1122 మంది అభ్యర్ధుల్లో శుక్రవారం వరకు 999 మంది తమ ఎన్నికల ఖర్చుల వివరాలను సమర్పించారని తెలిపారు. సమావేశంలో జీహెచ్​ఎంసీ కమిషనర్​ లోకేష్​ కుమార్​, ఎస్​ఈసీ కార్యదర్శి అశోక్​ కుమార్​ తదితరులున్నారు.

వేల మంది అభ్యర్థులపై అనర్హత వేటు

ఇక రాష్ట్ర వ్యాప్తంగా 2‌‌019 పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన వారిలో చాలా మందిపై అనర్హత వేటు వేసినట్లు ఎస్​ఈసీ పార్థసారథి వెల్లడించారు. సర్పంచ్​ స్థానాల్లో పోటీ చేసిన 36,369 మంది అభ్యర్థుల్లో 3789 మంది లెక్కలు ఇవ్వలేదని వివరించారు. వీరిలో 17 మంది గెలిచిన వారు కూడా ఉన్నారని చెప్పారు. వారిపై అనర్హత వేటు వేశామని, ఇంకా 3772 మందిని మూడేండ్ల వరకు పోటీ చేయకుండా వేటు వేసినట్లు వివరించారు. అదే విధంగా 2,3‌‌0,486 మంది వార్డు స్థానాలకు పోటీ చేస్తే 32,257 మంది ఖర్చు వివరాలివ్వలేదన్నారు. వీరిలో 3499 మంది గెలిచిన వారున్నారు. వీరితో పాటుగా ఓడిన 28,758 మందిపై అనర్హత వేటు వేసినట్లు చెప్పారు. ఎంపీటీసీ స్థానాల్లో కూడా 19,090 మంది అభ్యర్థులు పోటీ చేస్తే 3105 మంది ఖర్చు వివరాలివ్వలేదని, వీరిలో ఆరుగురు గెలిచిన వారు కూడా ఉన్నారని తెలిపారు. జెడ్పీటీసీ స్థానాల్లో 2429 మంది పోటీ చేస్తే 348 మంది ప్రచార వ్యయ వివరాలను ఇవ్వలేదని, వీరిపై మూడేండ్ల పాటు అనర్హత వేటు వేసినట్లు పార్థసారధి ప్రకటించారు.

ఆ గ్రామాల్లో సర్పంచ్‌లే మిగిలారు

యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్​ మండలం జియాపల్లి, జియాపల్లి తండా గ్రామ పంచాయతీల్లో వార్డు సభ్యులు మొత్తం లెక్కలు సమర్పించకపోవడంతో వారందరూ పదవులు కోల్పోయారు. ఈ రెండు పంచాయతీల్లో పాలకవర్గాలు లేవని, కేవలం సర్పంచ్​లు మాత్రమే ఉన్నట్లు పార్థసారధి ప్రకటించారు.


Next Story

Most Viewed