గవర్నర్ అపాయింట్‌మెంట్ కోరిన నిమ్మగడ్డ

by  |
గవర్నర్ అపాయింట్‌మెంట్ కోరిన నిమ్మగడ్డ
X

దిశ, వెబ్‌డెస్క్: నిమ్మగడ్డ రమేశ్‌‌ కుమార్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పదవి నుంచి తొలగిస్తూ‌ ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను హైకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. అయితే, ఏపీ హైకోర్టు ఉత్తర్వులను ప్రభుత్వం అమలు చేయడం లేదని నిమ్మగడ్డ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిగింది. ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగినా.. అత్యున్నత న్యాయస్థానం స్టే ఇవ్వలేదని రమేశ్‌ కుమార్‌ తరఫున న్యాయవాది అశ్వనీకుమార్‌ వాదనలు వినిపించారు.

అయినప్పటికీ ఏపీ ప్రభుత్వం హైకోర్టు తీర్పును అమలు చేయట్లేదని కోర్టుకు వివరించారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంపై హైకోర్టు తీర్పును తప్పకుండా అమలు చేయాలని.. నిమ్మగడ్డ గవర్నర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించాలని న్యాయస్థానం సూచించింది.

ఈ నేపథ్యంలోనే గవర్నర్‌ను కలిసేందుకు నిమ్మగడ్డ అపాయింట్ మెంట్ కోరారు. ఈ విషయాన్ని రమేష్ కుమార్ లాయర్ కోర్టుకు వివరించగా.. హైకోర్టు స్పందిస్తూ తమ ఆదేశాల మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను నియమించే అధికారం గవర్నర్‌కు ఉందని స్పష్టం చేసింది. అంతేకాకుండా, ఈ కేసుకు సంబంధించి కౌంటర్‌ దాఖలు చేయాలని ఏపీ సర్కారుని హైకోర్టు ఆదేశించి, ఈ కేసు విచారణను వచ్చే శుక్రవారానికి వాయిదా వేసింది.

Next Story

Most Viewed