లార్డ్ శివా.. లార్జ్ బెర్త్!

by  |
లార్డ్ శివా.. లార్జ్ బెర్త్!
X

దేవుడికి రైలులో బెర్త్ రిజర్వ్ చేయడం అనేది మీరు ఎక్కడైనా చూసారా? సాధారణంగానైతే మనుషులకు బెర్త్ బుక్ చేస్తాం. అయితే, వారణాసి నుంచి ఇటీవల ప్రధాని మోదీ ప్రారంభించిన కాశీ మహాకాల్ ఎక్స్‌‌ప్రెస్‌‌లో ఐఆర్‌సీటీసీ పరమ శివుడికి ప్రత్యేకించి బెర్త్‌ను కేటాయించింది. బీ5 కోచ్ లోని 64వ నెంబర్ సీటును రిజర్వ్ చేసింది.

జ్యోతిర్లింగాల వారధి..

ఈ కాశీ మహాకాల్ ఎక్స్‌ప్రెస్ మూడు జ్యోతిర్లింగ కేంద్రాలను కలుపుతుంది. వారణాసిలోని కాశీ విశ్వనాథ్, ఉజ్జయినిలోని మహాకాళేశ్వర్, ఇండోర్ సమీపంలోని ఓంకారేశ్వర్లను ఈ రైలులో ప్రయాణించేవారు దర్శించుకోవచ్చు. ఈ ఎక్స్‌ప్రెస్ 1,131 కిలో మీటర్లు ప్రయాణిస్తుందనీ, వారణాసి నుంచి ఇండోర్ వెళ్లే క్రమంలో లక్నో మీదుగా వెళ్తుందనీ, తిరుగు ప్రయాణంలో ప్రయాగరాజ్(అలహాబాద్) మీదుగా వారణాసికి వస్తుందని, 19 గంటల ప్రయాణముంటుందని అధికారులు చెబుతున్నారు. పూర్తి ఎయిర్ కండిషన్డ్ అయిన ఈ రైలు ఐఆర్‌సీటీసీ ఆధ్వర్యంలో నడుస్తుంది. కాగా, ఓ బోగిలో శివుడికి బెర్త్ కేటాయించడంపట్ల కొందరు రైల్వే అధికారులు మండిపడుతున్నారు. కాగా, కేవలం ప్రజలకు తెలియజేయడం కోసమే ఇలా చేసి ఉండొచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు.

ప్రయాణికులకు అనుమతి లేదా?

కాశీ మహాకాల్ ఎక్స్‌ప్రెస్ విజయవంతం కావడం కోసమే రైల్వే సిబ్బంది తాత్కాలికంగా శివుడు(భోలే బాబా) చిత్రపటాలను కోచ్ బీ 64వ సీటులో ఉంచారనీ, అది ఒక్క రోజుకే పరిమితమని రైల్వే అనుబంధ సంస్థ ఐఆర్‌సీటీసీ స్పష్టం చేసింది. ప్రారంభోత్సవం రోజున ఆ బెర్తులోకి సాధారణ ప్రయాణికులను అనుమతించకపోవడం గమనార్హం. కాగా, ఈ నెల 20న వాణిజ్య రైలుగా అందుబాటులోకి వచ్చే నాటికి శివుడి పేరిట ఆ బెర్త్ ఉండబోదని ఐఆర్‌సీటీసీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఒకవేళ బెర్తు శివుడికే రిజర్వ్ చేస్తే అందులోకి ప్రయాణికులకు అనుమతి ఉంటుందా.. బెర్త్ ఖాళీగా ఉండటం వల్ల ప్రయోజనమేముంటుందని కొందరు రైల్వే శాఖ అధికారులు ప్రశ్నిస్తుండటం గమనార్హం.


Next Story

Most Viewed