ప్రత్యేక రైళ్ల ప్రయాణికులకు రైల్వేశాఖ గైడ్‌లైన్స్

by  |

దిశ, న్యూస్‌బ్యూరో: స్క్రీనింగ్‌లో అనారోగ్య లక్షణాలున్నట్టు తేలిన వారిని రేపటి నుంచి ప్రారంభంకానున్న ప్రత్యేక రైళ్లలోకి అనుమతించబోమని, అలాంటివారికి టికెట్ డబ్బులు తిరిగి ఇచ్చేస్తామని దక్షిణ మధ్య రైల్వే(ఎస్‌సీఆర్) తెలిపింది. ఈ మేరకు ఎస్‌సీ‌ఆర్ శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రయాణికులంతా ఆరోగ్య సేతు యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలని, గమ్యస్థానాల్లో దిగిన తర్వాత ఆయా రాష్ట్ర ప్రభుత్వల నిబంధనల ప్రకారం నడుచుకోవాల్సిందేనని పేర్కొంది. ప్రత్యేక రైళ్లలో ప్రయాణం చేయాలనుకునే వారు రైలు సమయానికి కనీసం 90 నిమిషాలు ముందు రావాలని కోరింది. రైల్వే స్టేషన్‌లో లైసెన్స్‌డ్ కూలీలు తక్కువ ఉన్నందున ప్రయాణికులు తమతో లగేజీన తక్కువ ఉండేలా చూసుకోవాలని సూచించింది. దీర్ఘకాలిక వ్యాధులు(రక్తపోటు, మధుమేహం, గుండె సంబంధిత సమస్యలు, క్యాన్సర్, రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్నవారు) గర్భవతులు, 10సంవత్సరాల వయసులోపుఉన్న పిల్లలు, 65 సంవత్సరాలు మించి వయసున్న వృద్ధులు అత్యవసర పరిస్థితులుంటే తప్ప ప్రయాణం చేయవద్దని సూచించింది. రైళ్లలో దుప్పట్లు, బెడ్‌షీట్‌లు అందుబాటులో ఉండవని, ప్రయాణికులే తమ ఇంటినుంచి తెచ్చుకోవాలని కోరింది. ప్రయాణం పూర్తయ్యేవరకు రైలులో మాస్కు ధరించే ఉండాలని, ఎంట్రీ, ఎగ్జిట్‌లలో శానిటైజర్ అందుబాటులో ఉంటుందని అవసరమైన ప్రయాణికులు దానిని వాడుకోవచ్చేని తెలిపింది. రైల్వే స్టేషన్‌లలో కూర్చొని తినడానికి వీలుండదని, ఫుడ్ పార్సిళ్లు మాత్రమే అక్కడున్న రెస్టారెంట్‌లలో అమ్ముతారని పేర్కొంది.

Next Story