స్కూల్‌ను దత్తత తీసుకున్న తలసాని.. వసతులు లేక విద్యార్థినిలు సతమతం

by  |
స్కూల్‌ను దత్తత తీసుకున్న తలసాని.. వసతులు లేక విద్యార్థినిలు సతమతం
X

దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు వసతుల లేమితో దయనీయంగా తయారయ్యాయని ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు ప్రశ్నిస్తు్న్నప్పటికీ ఎలాంటి మార్పు కనిపించడం లేదు. అయితే, మారుమూల గ్రామాల్లోనే ఇలాంటి పరిస్థితులుంటాయని, పట్టణాల్లోని ప్రభుత్వ బడులు కార్పోరేట్‌కు ధీటుగా ఉంటాయనుకుంటే పప్పులో కాలేసినట్టే. సికింద్రాబాద్‌లోని వెస్ట్ మారేడ్‌పల్లిలో గల ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల పరిస్థితి అధ్వాన్నంగా మారినట్టు డక్కన్ క్రానికల్ ఓ కథనాన్ని ప్రచురించింది.

ఈ కథనం ప్రకారం.. పాఠశాల పట్టణం నడిబొడ్డున ఉన్నప్పటికీ విద్యార్థినులకు వసతులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే, ఈ పాఠశాలను సెప్టెంబర్ నెలలో స్థానిక మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దత్తత తీసుకున్నారు. మంత్రి హోదాలో ఉన్న నాయకుడు దత్తత తీసుకోవడంతో తమ సమస్యలకు చెక్ పడ్డట్టే అని విద్యార్థినులు సంతోషపడ్డారు. అయితే, మూడు నెలలు పూర్తైనా ఎలాంటి పురోగతి లేకపోను.. ఇప్పటి వరకు ఏ అధికారి, మంత్రి కానీ.. పాఠశాల వైపు చూసిన పాపానపోలేదు.

రైల్వే స్టేషన్‌కు వెళ్లే ప్రధాన రోడ్డుకి పక్కనే పాఠశాల ఉండటంతో.. బహిరంగ మూత్ర విసర్జనకు ప్రహరీ అడ్డాగా మారింది. దీంతో తీవ్రంగా దుర్వాసన వస్తోందని విద్యార్థినులు మంత్రికి ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా, ప్రహరీపై అడల్ట్ ఫిల్మ్ పోస్టర్లు అతికించడంతో ఇబ్బందులు పడుతున్నట్లు వారు చెప్పుకొచ్చారు. అయితే, విద్యార్థినులు మాత్రం.. గోడకు రంగులు వేయాలని, డ్రైనేజీని నుంచి దుర్వాసన వస్తున్నందున వాటిని మూసివేయాలని కోరుతున్నారు. ఇప్పటికైనా మంత్రి దత్తత తీసుకున్న విషయాన్ని గుర్తించి.. తమ ఇబ్బందులను తొలగించాలని విద్యార్థినులు కోరుతున్నారు.


Next Story

Most Viewed