నాన్నా.. ల్యాప్‌టాప్!

by  |
నాన్నా.. ల్యాప్‌టాప్!
X

కష్టమో, నష్టమో.. ఇన్ని రోజులు తరగతులు లేకుండా గడిచిపోయాయి. అందరూ హాస్టళ్లు వదిలేసి వాళ్ల వాళ్ల ఇంటికి వెళ్లిపోయారు. ఇంట్లో పూటకు సరిగా తిండి లేని తల్లిదండ్రులు.. తమ కొడుకు, కూతురు హాస్టళ్లలోనైనా మూడు పూటలా తింటారనే భరోసాతో ఉండేవారు. కానీ ఇప్పుడు బిడ్డ పదో తరగతి పూర్తి చేసుకున్నాడు. మంచికో చెడుకో పరీక్షలు రద్దయ్యి పాసైపోయాడు. ఇక తర్వాత చదవాల్సింది ఇంటర్మీడియట్. సాధారణ పరిస్థితుల్లో అయితే మంచి మార్కులు వచ్చిన విద్యార్థుల ఇంటికే కార్పొరేట్ కాలేజీలు వచ్చి, తమ కాలేజీలో జాయిన్ చేయాలని అడిగేవి. ఇప్పుడలా లేదు. కానీ మార్కుల వేటలో మునిగే కొన్ని కాలేజీలు మాత్రం ఆన్‌లైన్ పాఠాలు ప్రారంభించాలని నిర్ణయించుకున్నాయి. ఈ క్రమంలో మధ్యతరగతికి చెందిన పదో తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థినీ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కొత్త సమస్యల్లో పడ్డారు.

మామూలు రోజుల్లో అయితే, ఉన్న కొద్దిపాటి భూమిలోనే వ్యవసాయం చేసుకునే మధ్యతరగతి రైతు.. కాలేజీ ఫీజు, హాస్టల్ ఫీజు ఒకేసారి కట్టేసి ఈ పాటికి బిడ్డను కాలేజీకి పంపించి ఉండేవాడు. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. వ్యవసాయానికి పెట్టుబడిగా ఇప్పటికే అప్పు తేగా, ఇప్పుడు బిడ్డ కోసం కొత్తగా మరికొంత అప్పుచేయాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే అదృష్టం ఏంటంటే, ఈసారి హాస్టల్ ఫీజు బాధ లేదు. కేవలం కాలేజీ ఫీజు, ల్యాప్‌టాప్ ఫీజు కడితే సరిపోతుంది. అవును.. కొత్తగా కాలేజీలు ల్యాప్‌టాప్ ఫీజు అడుగుతున్నాయి. వాళ్లే ల్యాప్‌టాప్ కూడా అందించి ఆన్‌లైన్‌లో పాఠాలు చెబుతామని కొత్త మార్కెటింగ్ విధానాన్ని స్టార్ట్ చేశాయి. అయితే ఈ కాలేజీ యాజమాన్యాల మార్కెటింగ్ మతలబు.. గ్రామాల్లో నివసించే తల్లిదండ్రులకు అర్థం కాట్లేదు. అందుకే ఓ నలుగురిని సలహా అడుగుతున్నారు. కాగా, కాలేజీ వాళ్లిచ్చే ల్యాప్‌టాప్ తీసుకుంటే.. అది సరిగా పనిచేస్తుందో లేదోననే అనుమానాన్ని ఆ నలుగురు ఈ తల్లిదండ్రుల మనస్సుల్లో నాటుతున్నారు. మంచి ల్యాప్‌టాప్ ధర కనీసం రూ. 20000 ఉంటుందని తెలిసి.. డబ్బు ఎలా? అని ఆలోచిస్తున్నారు. కానీ పిల్లలు మాత్రం తమకు ల్యాప్‌టాప్ రాబోతుందనే సంబరంతో ప్రతిరోజూ ‘నాన్నా.. ల్యాప్‌టాప్’ అని అడుగుతుండటం గమనార్హం.

ఇక ఆన్‌లైన్ విద్య మాత్రమే దిక్కనుకున్న వాళ్లందరూ ల్యాప్‌టాప్ కొనడానికి సిద్ధమవుతున్నారు. అప్పుడు మరో సమస్య మొదలవుతోంది. అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ అవడం, ఇప్పటికే చాలా స్కూళ్లు ఆన్‌లైన్ పాఠాలు స్టార్ట్ చేయడంతో అందరూ ల్యాప్‌టాప్‌లు కొనేశారు. ఇక కొవిడ్ కారణంగా ల్యాప్‌టాప్ తయారీ సంస్థలు మూతపడటం, చైనా నుంచి ఉత్పత్తి తగ్గడంతో సప్లై కూడా తగ్గింది. ఇక సప్లై తగ్గి, డిమాండ్ పెరిగితే ధర కూడా పెరుగుతుంది కదా.. ఇప్పుడు ల్యాప్‌టాప్‌ల పరిస్థితి కూడా అలాగే మారింది. ఆషాడంలో బట్టల దుకాణాల దగ్గర ఉండాల్సిన రద్దీ మొత్తం ల్యాప్‌టాప్‌లు అమ్మే షాపుల వద్ద ఉండటాన్ని బట్టి ల్యాప్‌టాప్‌లకు డిమాండ్ ఎంత ఉందో చెప్పవచ్చు. కాబట్టి ల్యాప్‌టాప్ కొనాలంటే ఇప్పుడే కొనేయాలని, తర్వాత ధరలు పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. దీని వల్ల బిడ్డ చదువుకు ఇబ్బంది కలగకూడదు కాబట్టి, మధ్యతరగతి తల్లిదండ్రులు దీన్ని దృష్టిలో ఉంచుకోవాలి.


Next Story