పంచాయతీలో అవినీతి వెలుగులు

by  |
పంచాయతీలో అవినీతి వెలుగులు
X
దిశ, తెలంగాణ బ్యూరో: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలంలోని ఓ గ్రామంలో ఇటీవల ఎల్ఈడీ దీపాలను ఏర్పాటు చేశారు. ఇందుకోసం విప్రో సంస్థకు చెందిన లైట్లను కొనుగోలు చేశారు. 18 నుంచి 24 వాట్స్ లైట్ ఒక్కోదానికి ఫిట్టింగ్ చార్జీలతో కలుపుకుని రూ. 1710 చొప్పున చెల్లించారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీలలో ఎల్ఈడీ లైట్ల ఏర్పాటుకు అనుమతి పొందిన సంస్థ మాత్రం రెండింతల రేటును వసూలు చేస్తోంది. 18 వాట్స్ . లూమినోస్​ బల్బుకు రూ. 2933.31 చొప్పున తీసుకుంటోంది. ఇంత రేటు ఎందుకంటే కిందిస్థాయి నుంచి ఉన్నతస్థాయి వరకు కమీషన్లు ఇవ్వడడమేనని సమాధానం వస్తోంది. అసలే ఆర్థిక కష్టాలలో కొట్టుమిట్టాడుతున్న గ్రామ పంచాయతీల నుంచి వసూలు చేసుకుంటున్నారు. ఇప్పటికే ఎల్ఈడీ లైట్లు ఉన్నా, వాటన్నింటనీ తొలగించి కొత్తవి ఏర్పాటు చేస్తున్నారు. దీని కోసం పంచాయతీ పాలకవర్గాలపై ఒత్తిడి తెస్తున్నారు. తీర్మానాలు ఇవ్వాలంటూ హుకూం జారీ చేస్తున్నారు. దీంతో పంచాయతీలపై విద్యుత్ దీపాల భారం పెరగనుంది. వాటి ఏర్పాటు, నిర్వహణ బాధ్యతను ప్రభుత్వం ఏడేళ్లపాటు ఈఈఎస్ఎల్ సంస్థకు అప్పగించింది. వారికి నిధులు భారీగా వెచ్చించాల్సిన పరిస్థితి నెలకొంది. దీనిని సర్పంచులు వ్యతిరేకిస్తున్నారు.

రెండింతలుగా సొమ్ము

రాష్ట్రవ్యాప్తంగా 12,751 గ్రామ పంచాయతీలలో ఎల్ఈడీ విద్యుత్​ దీపాల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాదాపు 16.46 లక్షల ఎల్ఈడీ దీపాలను కొత్తగా బిగించనున్నారు. వీటికి చాలా మేరకు ధరలు పెంచినట్లు తెలుస్తోంది. కొన్ని గ్రామాలు ఇప్పటికే ఎల్ఈడీ దీపాలను ఏర్పాటు చేసుకున్నాయి. ఆ ధరలతో పోలిస్తే తాజాగా ప్రభుత్వం కొటేషన్​లో ప్రకటించిన ధరలకు చాలా వ్యత్యాసం ఉంటోంది. పెట్టుబడి వ్యయాన్ని భారీగా నిర్ధారించారు. పలు గ్రామాల్లో ఒక్కో వీధి దీపానికి కంపెనీ ధరల ప్రకారం బల్క్​గానే కొనుగోలు చేశారు. ఇప్పుడు ప్రభుత్వం అప్పగించిన సంస్థ కూడా ఒకేసారి లక్షల దీపాలు కొనుగోలు చేస్తుండటంతో భారీగా తక్కువకు వచ్చే ఛాన్స్​ ఉన్నా ఎక్కువ ధరలు పెట్టారు.

ఇష్టానుసారంగా కొటేషన్

18 వాట్స్ ఎల్ఈడీ దీపానికి రూ. 990గా పేర్కొనగా… ఇన్స్టాలేషన్​, పాత లైట్​ తొలగించడం, క్లాంప్స్, వైర్, కేబుల్, ప్రాజెక్టు మేనేజ్​మెంట్​ కన్సల్టెన్సీ ఫీజు వంటి కలుపుకుని ఒక్కో లైటును రూ. 2933.31కు బిగించనున్నారు. 35 వాట్స్ ఎల్​ఈడీకి రూ. 3,437.28 ఉండగా… 70 వాట్స్ బల్బుకు రూ. 4,674.55 చొప్పున, 110 వాట్స్​కు రూ. 6363.67 చొప్పున, 190 వాట్స్​ ఎల్​ఈడీకి రూ. 9927.13 చొప్పున పంచాయతీల నుంచి వసూలు చేయనున్నారు. వాస్తవంగా గ్రామాల్లో ఇప్పటి వరకు బిగించుకున్న 24 వాట్స్ లైట్లకే రూ. 1710 వరకు తీసుకున్నారు. కానీ ఇప్పుడు మాత్రం 18 వాట్స్ ఎల్ఈడీని బిగించేందుకు ఏకంగా రూ. 2933 చొప్పున బిల్లు వేస్తున్నారు. అంటే దాదాపుగా రెండింతలుగా బిల్లు వేస్తున్నారు. ప్రస్తుతం ఆయా గ్రామాలు విప్రో సంస్థ బల్బులను వాడుతుండగా… ఈ సంస్థ మాత్రం కొత్తగా లూమినోస్ ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేయనున్నారు. కంపెనీ ధరల ప్రకారం ఒక వందో, రెండు వందలో ఎక్కువగా ఉండే అవకాశాలున్నా.. భారీ స్థాయిలో పెంచడంపై గ్రామాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

ఏడేండ్ల వారంటీ ఉన్నా

ఈ స్థాయిలో ధరలు పెంచడం, వాటిని ఏర్పాటు చేసే అంశంలో కొన్ని గ్రామాల్లో సర్పంచ్లు నిలదీస్తున్నారు. పంచాయతీ అధికారులను అడుగుతున్నారు. అయితే ఏడేండ్ల వారంటీ ఉంటుందని సమాధానం దాటవేస్తున్నారు. వాస్తవానికి ఇప్పటికే పంచాయతీలు ఏర్పాటు చేసిన ఎల్ఈడీ లైట్లకు రెండేండ్ల వారంటీ ఉంది. కానీ లూమినోస్ సంస్థ లైట్లకు ఏడేండ్ల వారంటీ ఇస్తున్నారు. కానీ దీనికి ప్రతినెలా నిర్వహణ ఛార్జీలను వసూలు చేస్తున్నారు. ఏడేండ్ల వారంటీ ఉంటే మళ్లీ నిర్వహణ ఛార్జీలు ఎందుకు వసూలు చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు.

పంచాయతీలకు భారం..

వీధిదీపాల నిర్వహణ, విద్యుత్తు చార్జీల చెల్లింపుల బాధ్యతను ఇప్పటి వరకూ పంచాయతీలు చూస్తున్నాయి. ఇపుడు బాధ్యతను ఈఈఎస్‌ఎల్‌కు అప్పగిస్తున్నారు. నెలవారీగా తమకు చెల్లించే నిర్వహణ చార్జీల్లో పెట్టుబడి వ్యయం తిరిగి రాబట్టడం, దీపాల సామగ్రి, ప్రాజెక్టు నిర్వహణ, సాఫ్ట్‌వేర్‌ అభివృద్ధి, డాష్‌బోర్డు నిర్వహణ ఖర్చులు మాత్రమే ఉంటాయని ఆ సంస్థ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. అంటే ఎక్కువ ధరతో ఏర్పాటు చేస్తూనే నెలనెలా నిర్వహణ చార్జీలు తీసుకోనున్నారు. ఒక్కనెల ఆలస్యమైనా అపరాధ రుసుముతో కలిపి వసూలు చేయనున్నారు. నిర్వహణలో నెలవారీ విద్యుత్తు చార్జీలు లేకపోవడంపై పంచాయతీ అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం 120 దీపాలున్న గ్రామంలో నెలకు రూ. 8 వేల వరకు చార్జీలు పడుతుంటే, ఒప్పందం ప్రకారం నిర్వహణకు నెలకు రూ. 18 వేల వరకు భరించాల్సి పరిస్థితి ఉంటుందని అంటున్నారు. ఈ లెక్కన పంచాయతీలపై అదనంగా రూ. 10 వేలు వసూలు చేసుకుంటారని స్పష్టమవుతోంది.

ఎందుకీ అదనపు వసూళ్లు..?

వాస్తవంగా పంచాయతీలు ఆర్థిక కష్టాల్లో ఉంటున్నాయి. పల్లె ప్రగతి కింద ఇచ్చే నిధులు ఇప్పటికే విద్యుత్ బిల్లు, ట్రాక్టర్ల ఈఎంఐల వరకు సరిపోతున్నాయి. మళ్లీ వేతనాల కోసం సొంత ఆదాయంతో వచ్చే వాటినే వాడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎల్ఈడీ లైట్ల ఏర్పాటు, వాటి మెయింటెనెన్స్ పేరుతో మరింత భారం మోయాల్సి వస్తోంది. దీనికి సొమ్ము ఎక్కడి నుంచి తేవాలనేదే అంతుచిక్కని ప్రశ్న. ఇదిలా ఉంటే పంచాయతీలు బిగించుకునే ఎల్ఈడీ వీధి దీపాలతో పోలిస్తే ప్రభుత్వం అప్పగించిన సంస్థ నుంచి బిగించే వాటికి ఎక్కువగా చెల్లించే సొమ్ము అదనంగా ఉంటోంది. ఎందుకంటే ఇక్కడ కూడా కమీషన్ల కోసమేనంటూ స్థానిక సంస్థల అధికారులే ఆఫ్​ ది రికార్డుగా చెప్పుతున్నారు.



Next Story

Most Viewed