చాదర్‌ఘాట్ ఘటనపై ఎస్సీ కమిషన్ సీరియస్

by  |
చాదర్‌ఘాట్ ఘటనపై ఎస్సీ కమిషన్ సీరియస్
X

దిశ, హైదరాబాద్ :
నగరంలోని చాదర్‌ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో దళిత మైనర్ బాలికపై జరిగిన అత్యాచార ఘటనపై రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌తో పాటు జాతీయ ఎస్సీ కమిషన్ సీరియస్ అయ్యింది. ఈ ఘటనపై తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ కేసును సుమోటోగా స్వీకరించినట్టు కమిషన్ చైర్మన్ డాక్టర్ ఎర్రోళ్ళ శ్రీనివాస్ తెలిపారు. వెంటనే పూర్తిస్థాయి వివరాలతో నివేదిక అందజేసి, నిందితుడిని కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకోవాలని పోలీస్ ఉన్నతాధికారులను ఆదేశించారు. బాధితురాలికి న్యాయం జరిగే వరకు కమిషన్ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ప్రభుత్వం నుంచి ఎక్స్‌గ్రేషియా అందించాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కమిషన్ చైర్మన్ డాక్టర్ ఎర్రోళ్ళ శ్రీనివాస్‌తో పాటు కమిషన్ సభ్యులు విద్యాసాగర్, రాంబల్ నాయక్ ఉన్నారు.

కమిషన్‌ను కించపరిస్తే కేసు నమోదు..

ఎమ్మెల్యే అయినా చట్టానికి లోబడాల్సిందేనని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు రాములు మలక్‌పేట్ ఎమ్మెల్యే బలాలను హెచ్చరించారు. గుజరాత్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలు సైతం నిందితులుగా ఉంటే వారిపై అట్రాసిటీ కేసులు పెట్టిన విషయాలను హైదరాబాద్ పోలీసులు తెలుసుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘స్థానిక ఎమ్మెల్యే బలాల ఎస్సీ కమిషన్‌ను కించపరుస్తూ మాట్లాడినట్టు తెలిసిందని, ఆయనపైనా కేసు నమోదు చేస్తామన్నారు. ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎంత పెద్ద అధికారి అయినా బోనులో నిల్చోవాల్సిందేనని హెచ్చరించారు. హైదరాబాద్ నగరంలో దళితులకు రక్షణ కల్పించే విషయం, కేసు విచారణకు సంబంధించిన విషయాలపై ప్రభుత్వానికి, డీజీపీకి, సీఎస్‌కు లేఖ రాస్తానని అన్నారు. స్థానిక ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అంబేద్కరిస్టుగా చెప్పుకుంటూ దళితులపై అత్యాచారం జరిగితే ఎందుకు మాట్లాడటం లేదన్నారు. బాధితురాలికి జాతీయ ఎస్సీ కమిషన్ నుంచి, ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో అండగా ఉంటామన్నారు. ఈ మేరకు రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు.

Tags: SC, ST Atrocity case, Commission, Chaderghat, Telangana

Next Story

Most Viewed