2021-22 వృద్ధి అంచనాను 7.9 శాతానికి తగ్గించిన ఎస్‌బీఐ ఎకోరాప్

by  |
2021-22 వృద్ధి అంచనాను 7.9 శాతానికి తగ్గించిన ఎస్‌బీఐ ఎకోరాప్
X

దిశ, వెబ్‌డెస్క్: భారత జీడీపీ వృద్ధి కొవిడ్ సెకెండ్ వేవ్ ప్రభావం నేపథ్యంలో 2021-22 ఆర్థిక సంవత్సరానికి 10.4 శాతం నుంచి 7.9 శాతానికి అంచనాలను తగ్గిస్తున్నట్టు ఎస్‌బీఐ ఆర్థికవేత్తలు వెల్లడించారు. ఆర్థికవ్యవస్థపై ప్రతికూల ప్రభావం అత్యధికంగా కనిపిస్తోంది. ముఖ్యంగా పట్టణాల కంటే గ్రామీణ ప్రాంతం పటిష్టంగా లేనందున, అసాధారణ డిమాండ్ పరిస్థితుల నేపథ్యంలో 2021-22లో జీడీపీ అంచనాలలో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. ఈ పరిణామాల కారణంగా వృద్ధి నెమ్మదిగా ఉంటుందని ఎస్‌బీఐ పరిశోధనా విభాగం ఎకోరాప్ నివేదిక తెలిపింది. అలాగే, ఈ ఏడాది అంతర్జాతీయ మార్కెట్లో వస్తువుల ధరలు భారీగా పెరగడంతో 2021-22లో జీడీపీ దృక్పథం ప్రభావితమవుతుందని, ఇది దేశీయ ధరలపై కనిపిస్తుందని, తద్వారా దేశీయ వినియోగం దెబ్బతినవచ్చని ఎకోరాప్ అభిప్రాయపడింది.

దేశీయంగా ఉన్న సేవల రంగంలోని వాణిజ్యం, హోటళ్లు, రవాణా, కమ్యూనికేషన్ రంగాల్లోని 25 కోట్ల కుటుంబాల వినియోగ పరిస్థితులపై రికవరీ ఆధారపడి ఉంటుందని నివేదిక వివరించింది. ఇదే సమయంలో ఈ ఏడాది మార్చితో ముగిసిన త్రైమాసికంలో కార్పొరేట్ కంపెనీల త్రైమాసిక ఆదాయ వివరాలు మెరుగైన వృద్ధిని వెల్లడిస్తున్నాయి. ఈ సానుకూల ఫలితాలు స్వల్పకాలానికి పరిమితం కావొచ్చని ఎకోరాప్ నివేదిక పేర్కొంది. 2021-22కి వాస్తవ జీడీపీ వృద్ధి సానుకూలంగా ఉండనుంది.

గత ఆర్థిక సంవత్సరం కంటే మెరుగ్గా రియల్ జీడీపీ రూ. 145.8 లక్షల కోట్లుగా ఉంటుందని నివేదిక తెలిపింది. దీంతో రికవరీ ‘వి’ ఆకారానికి బదులుగా ‘డబ్ల్యూ’ ఆకారం ఉండొచ్చని ఎకోరాప్ నివేదిక అంచనా వేసింది. కాగా, మార్చితో ముగిసిన త్రైమాసికంలో దేశ ఆర్థికవ్యవస్థ ఊహించిన దానికంటే వేగంగా 1.6 శాతం వృద్ధిని సాధించినట్టు సోమవారం విడుదల అధికారిక గణాంకాలు వెల్లడించాయి. పూర్తి ఆర్థిక సంవత్సరానికి 7.3 శాతంగా నమోదైంది. చాలామంది విశ్లేషకులు రెండంకెల వృద్ధిని అంచనా వేసినప్పటికీ కరోనా సెకెండ్ వేవ్, సంబంధిత పరిణామాలతో వృద్ధి స్థిరంగా నమోదైంది.


Next Story