స‌త్తుప‌ల్లి అభివృద్ధికి నిధులివ్వండి : సండ్ర‌

by  |
స‌త్తుప‌ల్లి అభివృద్ధికి నిధులివ్వండి : సండ్ర‌
X

దిశ ప్ర‌తినిధి, ఖ‌మ్మం: రాష్ట్ర రాజకీయ ముఖచిత్రంలో చైతన్యవంతమైన ప్రాంతమైన సత్తుపల్లి ప్రాంత అభివృద్ధికి సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చినట్టు సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తెలిపారు. శుక్రవారం సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య హైద్రాబాద్‌లోని ప్రగతిభవన్‌‌లో సీఎం కేసీఆర్‌ను కలసి పలు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో నూతన గదులు నిర్మాణానికి నిధులు మంజూరు చేయాల‌ని, సింగరేణి సంస్థ నిధులతో ఎన్టీఆర్ కాలనీ సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న ఫారెస్ట్ అర్బన్ పార్క్ నిధులు కేటాయించాలని కోరారు. అలాగే సత్తుపల్లి రింగ్ సెంటర్ నుంచి మండలంలోని రేజర్ల వరకు రహదారిని విస్తరించి సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలని, సత్తుపల్లి-పెనుబల్లి వరకూ జాతీయ రహదారిని నాలుగు లైన్ల రహదారిగా అభివృద్ధి చేయాలని విన్న‌వించారు. సర్వశిక్షా అభియాన్ పనిచేస్తున్న వారికి జీతాలు మంజూరు చేయాలని కోరారు. సత్తుపల్లి, పెనుబల్లి ప్రభుత్వ ఆసుపత్రులకు అంబులెన్సులను నూతనంగా మంజూరు చేయాలని, ప్రభుత్వ బాలుర పాఠశాల, జూనియర్ కళాశాలలకు నూతన భవనాల నిర్మాణం జ‌రిగేలా నిధులు కేటాయించేలా చూడాల‌ని ముఖ్య‌మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి విలువైన భూములు కోల్పోతున్న రైతులకు న్యాయమైన నష్టపరిహారం ఇప్పించాలని ప్రభుత్వానికి విన్నవించారు. ఈ సమస్యలపై సీఎం కేసీఆర్ వినతిపత్రం అందజేయగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

Next Story

Most Viewed