సెబీ ఆదేశాలపై శాట్‌కు అప్పీల్ చేసిన పీఎన్‌బీ హౌసింగ్ ఫైనాన్స్

by  |
సెబీ ఆదేశాలపై శాట్‌కు అప్పీల్ చేసిన పీఎన్‌బీ హౌసింగ్ ఫైనాన్స్
X

దిశ, వెబ్‌డెస్క్: కార్లయిల్ సంస్థకు వాటా విక్రయం ద్వారా రూ. 4 వేల కోట్ల నిధులు సమీకరణ ప్రక్రియను నిలిపేయాలని పీఎన్‌బీ హౌసింగ్ ఫైనాన్స్‌కు సెబీ ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ పూర్తయ్యేవరకు ముందుకెళ్లకూడదని సెబీ వెల్లడించింది. అయితే, నిధుల సమీకరణను చేపట్టి తీరాలని, మంగళవారం జరిగే ప్రత్యేక వార్షిక సమావేశం(ఈజీఎం)లో దీనికి ఆమోదం సాధించాలని పీఎన్‌బీ ఫైనాన్స్ భావిస్తోంది. దీనికోసం సెబీ ఆదేశాలను వ్యతిరేకిస్తూ సంస్థ సోమవారం సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రబ్యునల్(శాట్)కు అప్పీల్ చేసింది. పీఎన్‌బీ హౌసింగ్ ఫైనాన్స్ అప్పీల్‌ను విచారణకు అంగీకరించిన శాట్ మంగళవారం సంస్థ ఈజీఎం నిర్వహించేందుకు అనుమతి మంజూరు చేసింది.

కానీ, ఈజీఎం సమావేశంలో తీసుకునే తీర్మానాలను నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (ఎన్ఎస్‌డీఎల్)కు చెప్పాలని స్పష్టం చేసింది. తదుపరి ఆదేశాలను జారీ చేసే వరకూ ఈజీఎంలో తీసుకునే తీర్మానాలను బహిర్గతం చేయకూడదని తెలిపింది. తర్వాతి విచారణ జులై 5వ తేదీన జరగనుంది. సెబీ ఆదేశాలపై శాట్ ముందు వివరణ ఇచ్చిన పీఎన్‌బీ హౌసింగ్ ఫైనాన్స్.. సెబీ సూచించిన చట్టపరమైన నిబంధనలను, చట్టాలకు కట్టుబడి ఈ ఒప్పందం జరుగుతుందని చెప్పినట్టు ఓ ప్రకటనలో తెలిపింది.

Next Story

Most Viewed