సూర్యాపేట జిల్లాలో హాట్ టాపిక్‌గా మారిన సర్పంచ్ దంపతులు

by  |
Shirisha Kondareddy
X

దిశ, హుజూర్ నగర్: నన్ను గెలిపించండి.. మీకు సేవ చేస్తానని రాజకీయాల్లోకి వచ్చి కోట్లు కూడబెట్టుకుంటున్న ఈ రోజుల్లో ఓ యువజంట అందుకు భిన్నంగా ప్రజాసేవ, గ్రామాభివృద్ధే ధ్యేయంగా పని చేస్తోంది. ఆపద అంటే మేమున్నామంటూ ముందుకు వస్తున్నారు. కరోన కష్టకాలంలో వందల మందికి కడుపు నింపి నేటి రాజకీయ నాయకులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. భర్త వార్డు మెంబర్‌గా, భార్య సర్పంచ్‌గా నిర్విరామంగా సేవలు అందిస్తూ పార్టీలకు అతీతంగా గ్రామస్తుల మన్ననాలు పొందుతున్నారు. వారి సేవలకు మెచ్చిన ప్రభుత్వం భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఉత్తమ సర్పంచ్ పురస్కారాన్ని అందించి సత్కరించింది. ఇంతకూ ఆ ఆదర్శ ప్రజాసేవకులు ఎవరు అనుకుంటున్నారా.. వాళ్లే వేపల సింగారం సర్పంచ్ అన్నెం శిరీష, వార్డు మెంబర్ కొండారెడ్డి దంపతులు.

ఇచ్చిన మాటకు కట్టుబడి..

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలం వేపల సింగారం గ్రామానికి చెందిన అన్నెం కొండారెడ్డి, శిరీష దంపతులు డిగ్రీ వరకు చదివారు. వ్యవసాయ కుటుంబం అయిన వీళ్లు గత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో శిరీష సర్పంచ్‌గా, ఆమె భర్త కొండారెడ్డి వార్డు మెంబర్‌గా పోటీ చేశారు. ఎన్నికల ప్రచారంలో గ్రామాభివృద్ధికి పాటుపడుతామని, గ్రామస్తుల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటామని మాట ఇచ్చారు. దీంతో గ్రామస్తులు వారిద్దరికి విజయం కట్టబెట్టారు. ఎన్నికైన నాటి నుంచి ఆ ఇద్దరు దంపతులు గ్రామాభివృద్ధిపైనే దృష్టిపెట్టి అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారు. మరోవైపు ప్రజాసేవ చేస్తూ జిల్లాలోనే ఆదర్శంగా నిలిచారు.

Shirisha

కరోనను ఎదురించి.. ప్రజాసేవ

ఒకే ఇంట్లో .. ఒకే పాలకవర్గంలో దంపతులు ఇరువురు ప్రజా ప్రతిధులుగా గ్రామ అభివృద్ధిలో తమ మార్కు చూపిస్తున్నారు. భర్త అన్నెం కొండారెడ్డి సహకారంతో సర్పంచ్ శిరీష గ్రామానికి మెరుగులు దిద్దుతున్నారు. దేశాన్ని వణికించిన కరోనా వ్యాప్తిని అరికట్టడానికి ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. ఆ సమయంలో కూలీకి వెళ్తే తప్ప పూట గడవని నిరుపేదలకు, కరోనా బాధితులకు నిర్విరామంగా 52 రోజుల పాటు స్వయంగా వండి భోజనం అందించారు అన్నెం శిరీషా కొండారెడ్డి దంపతులు. అదే సమయంలో గ్రామస్తులను పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశ్యంతో కూరగాయలు, గుడ్లను తక్కువ ధరకే ప్రతి ఇంటి వద్దకు ఓ వెహికల్ పంపించి అందించారు. ఎప్పటికప్పుడు వైద్య అధికారుల సహాయంతో ముందస్తుగానే సీజనల్‌గా వచ్చే మలేరియా, టైఫాయిడ్, డెంగీ వంటి వ్యాధుల పట్ల మెడికల్ క్యాంపులు నిర్వహించడానికి కృషిచేశారు.

Vaikuntadhamam

మరో గంగదేవిపల్లిల వేపల సింగారం

అంతేగాక మండలంలోనే అత్యద్భుతంగా పల్లె ప్రకృతి వనాన్ని, అన్ని వసతులతో కూడిన వైకుంఠధామాన్ని నిర్మించి అందరికీ ఆదర్శంగా నిలిచారు అన్నెం దంపతులు. దోమల నివారణకు సూర్యాపేట జిల్లాలోనే మొదటిసారిగా గ్రామానికి ఫాగింగ్ మిషన్ తెప్పించారు. నీటి సరఫరా, కరెంట్ సరఫరా, వినియోగం పట్ల ప్రజలలో అవగాహన కల్పిస్తున్నారు. గ్రామంలో సీసీరోడ్లు, డ్రైనేజీల నిర్మాణం చేపట్టారు. నిత్యం ప్రజల్లో ఉంటు రాష్ట్రంలోనే వేపల సింగారం గ్రామాన్ని మరో గంగదేవిపల్లిల రూపుద్దిదుకోవడానికి కృషి చేస్తున్నారు.

toilets

ఈ దంపతులను ప్రభుత్వమూ మెచ్చె..

ఒకే ఇంట్లో ఇద్దరు ప్రజాసేవలకు అంకితం అవడం ప్రశంసనీయమే. ఎలాంటి స్వార్ధం లేకుండా ప్రజలకు సేవ చేస్తున్న ఈ దంపతులను ప్రభుత్వం సైతం గుర్తించింది. వారి సేవలను ప్రతిఫలంగా.. 75వ భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి చేతుల మీదుగా ఉత్తమ సర్పంచ్‌గా పురస్కారం అందుకున్నారు. తమ గ్రామ సర్పంచు ఉత్తమ పురస్కారం అందుకోవడం పట్ల ఆ గ్రామ ప్రజలు, జిల్లా సర్పంచులు, అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.



Next Story

Most Viewed