వీడిన మర్డర్ మిస్టరీ..? అలా చేయొద్దన్నందుకే సంతోష్‌ దారుణ హత్య

by  |
వీడిన మర్డర్ మిస్టరీ..? అలా చేయొద్దన్నందుకే సంతోష్‌ దారుణ హత్య
X

దిశప్రతినిధి, కరీంనగర్ : తెల్లవారు జామున పొదల్లోంచి మంటలు కనిపిస్తున్నాయి. ఏంటా అని వెళ్లి చూసే సరికి ఆ మంటల్లో యువకుడు కాలిపోతున్నాడు. దీనిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ మర్డర్ మిస్టరీని ఛేదించేందుకు ఆరు పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. ఎట్టకేలకు హత్య వెనుక దాగి ఉన్న కుట్ర కోణాన్ని, హత్య చేసేందుకు వేసిన స్కెచ్‌ను ఛేదించారు. నిందితులను పట్టుకోవడమే మిగిలింది. రెండు, మూడు రోజుల్లో నిందితులను కోర్టులో హాజరు పర్చేందుకు పోలీసులు సమాయత్తం అవుతున్నట్టు సమాచారం.

కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం విలాసాగర్ గ్రామానికి చెందిన సంతు గౌడ్ అనే యువకుడిని ఈ నెల 13వ తేదీన తెల్లవారు జామున వెంకటేశ్వరుల పల్లి శివార్లలో హత్య చేశారు. ఘటన వెలుగులోకి రాగానే పోలీసులు రంగంలోకి దిగి ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుండి రాబట్టిన సమాచారం మేరకు మరి కొందరిని విచారించిన పోలీసులు మర్డర్ మిస్టరీని ఛేదించినట్టు తెలుస్తోంది.

మంచి చెప్పిన పాపానికి..

ఈ కేసులో ప్రధాన నిందితుడు హతుడు సంతోష్‌తో సన్నిహితులుగా మెదిలేవారని, ఓ వివాహేతర సంబంధం కారణంగా హతుడు చెప్పిన మంచి మాటలే మర్డర్ కు దారితీసి ఉంటాయని అనుమానిస్తున్నారు. నిందితుని భార్య పుట్టింటికి వెళ్లిన సమయంలో మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని పోలీసులు గుర్తించినట్టు సమాచారం. అయితే, నిందితుని భార్య విషయంలో వచ్చిన గొడవకు కూడా వెళ్లిన హతుడు అతన్ని మందలించినట్టు సమాచారం. ఈ విషయంపై తరుచూ నిందితునికి సర్దిచెబుతూ భార్యను తీసుకొచ్చుకుని కాపురం చేసుకోవాలని చెప్పేవాడని సమాచారం. ఇదే క్రమంలో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళపై కూడా హతుడు సంతోష్ ఆగ్రహం వ్యక్తం చేశాడని తెలుస్తోంది. దీంతో సంతోష్ పై నిందితుడు కోపం, కసి పెరిగేలా చేసిందని పోలీసుల విచారణలో తేలినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే సంతోష్‌ను హతమార్చేందుకు వ్యూహం రచించుకున్న వీరిద్దరూ వరంగల్‌కు చెందిన మరికొందరిని ఈ స్కెచ్ లో ఇన్వాల్వ్ చేయించి మర్డర్ చేసినట్టు తెలుస్తోంది.

స్కూటీపై..

13వ తేది తెల్లవారు జామున సంతోష్‌ను హత్య చేసిన అనంతరం నిందితులు స్కూటీపై సిరిసిల్ల జిల్లా వేములవాడకు చేరుకుని అక్కడి నుంబి కొండగట్టు సమీపంలోని ముత్యంపేట వరకు వెళ్లి అక్కడ తమ మొబైల్స్ స్విచ్ఛాప్ చేసి వెళ్లిపోయారని తెలుస్తోంది. మర్డర్ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న కరీంనగర్ సీపీ సత్యనారాయణ ఆరు టీములను రంగంలోకి దింపారు. నిందితుల కోసం వేటాడుతున్న స్పెషల్ టీంలు బెంగుళూరు ప్రాంతంలో తిరుగుతున్నారని గుర్తించారు. అక్కడి నుంచి నేరుగా ఏపీకి చేరుకున్నారని తెలుసుకున్నారు. వీరిని పట్టుకునేందుకు ఇన్వెస్టిగేషన్ టీంలు ఏపీకి వెళ్లినట్టు సమాచారం. నిందితులను పట్టుకుని ఒకటి రెండు రోజుల్లో కోర్టులో ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.


Next Story