మరుగుదొడ్డే.. హోమ్ ఐసోలేషన్ సెంటర్

by  |
మరుగుదొడ్డే.. హోమ్ ఐసోలేషన్ సెంటర్
X

దిశ, వికారాబాద్ : కరోనా నియంత్రణలో వైద్యులు.. పోలీసులు.. పారిశుధ్య కార్మికులు చేసిన సేవలు మరువలేనివని.. ప్రజాప్రతినిధులు తెగ పొగిడేస్తారు. అవసరమైతే వారికి శాలువాలు కప్పి సన్మానాలు చేసి ఫోటోలకు ఫోజులు ఇచ్చి, పత్రికల్లో తాటాకు అంత అక్షరాలతో అచ్చు వేయించుకుంటారు. నిజానికి ఓ పారిశుద్ధ్య కార్మికుడు కరోనా బారిన పడితే కనీసం కనికరం కూడా చూపడం లేదు. పారిశుద్ధ్య కార్మికునికి కనీస సౌకర్యాలు కల్పించకపోవడంతో.. మరుగుదొడ్డే.. హోం ఐసోలేషన్ గదిగా మార్చుకుని చికిత్స తీసుకుంటున్నాడు.

ఐదు నిమిషాలు మరుగుదొడ్డిలో కాలకృత్యాలు తీర్చుకొనేందుకు ముక్కు మూసుకొని వెళ్తాం. అలాంటిది.. గత మూడు రోజులుగా కరోనా సోకి మరుగుదొడ్డిలోనే జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ దయనీయ ఘటన వికారాబాద్ నియోజకవర్గం దారుర్ మండల పరిధిలోని మైలారం గ్రామంలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. మైలారం గ్రామానికి చెందిన పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తున్న అశోక్.. ఈ మధ్యనే కరోనా బారిన పడ్డాడు. దీంతో గ్రామ కార్యదర్శి విధులకు హాజరు కావద్దని, ఇంటి వద్దనే ఉంటూ హోమ్ ఐసోలేషన్‌లో చికిత్స పొందాలని సూచించారు. కానీ.. అశోక్ చిన్నపాటి ఇంట్లోనే భార్య, ఇద్దరు పిల్లలు, వృద్ధ తల్లిదండ్రులు ఉంటున్నాడు. చేసేదేమీలేక తన వల్ల తన కుటుంబ సభ్యులకు ఎలాంటి హాని జరగరాదని భావించి మరుగుదొడ్డినే హోమ్ ఐసోలేషన్ గదిగా మార్చుకున్నాడు. కంపుకొడుతున్న సరే.. తప్పనిసరి పరిస్థితుల్లో మరుగుదొడ్డిలో నివాసం ఉంటూ దయనీయ స్థితిని ఎదుర్కొంటున్నాడు.

పారిశుద్ధ్య కార్మికులు పని చేసినందుకు రావాల్సిన వేతన డబ్బులు కూడా సరైన సమయంలో రాకపోవడంతో.. మందులు సైతం తీసుకోలేని పరిస్థితి నెలకొంది. పైగా అశోక్‌కు బదులుగా వారి కుటుంబ సభ్యులు పారిశుద్ధ్య పనులు చేయాలంటూ సంబంధిత అధికారులు చెబుతున్నారని అశోక్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కరోనా సమయంలో అధికారులు తనకు సహాయం చేయకపోగా.. తనకు బదులు తన కుటుంబ సభ్యులు విధులు నిర్వహిస్తేనే వేతనం ఇస్తామనడం ఎంతో బాధకు గురి చేస్తుందని కన్నీరు మున్నీరు అయ్యారు. చుట్టుపక్కల వారు సైతం తీవ్ర మనోవేదనకు గురి చేస్తున్నారని, తన యందు దయ ఉంచి ఐసోలేషన్ సెంటర్లో తనకు చికిత్స అందించాలని సంబంధిత అధికారులను వేడుకుంటున్నారు.


Next Story

Most Viewed