రాజస్థాన్ రాయల్స్ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా సంగక్కర

by  |
రాజస్థాన్ రాయల్స్ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా సంగక్కర
X

దిశ, స్పోర్ట్స్: రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ తమ డైరెక్టర్ ఆఫ్ క్రికెటర్‌గా శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కరను నియమించింది. ప్రస్తుతం మెల్‌బోర్న్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) అధ్యక్షుడిగా ఉన్న సంగక్కర, రాబోయే ఐపీఎల్ 14వ సీజన్‌లో రాజస్థాన్ జట్టు డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా వ్యవహరిస్తాడని ఆదివారం ప్రకటించింది. రాజస్థాన్ జట్టుకు సంబంధించిన కోచింగ్, వ్యూహాలు, ప్రణాళికలు, టాలెంట్ డిస్కవరీ, అభివృద్దికి సంబంధించిన విషయాలను ఇకపై సంగక్కర ఆధ్వర్యంలోనే కొనసాగనున్నాయి.

నాగ్‌పూర్‌లో రాయల్స్ అకాడమీ అభివృద్దిలో కూడా సంగక్కర కీలక పాత్ర పోషించనున్నట్లు ఫ్రాంచైజీ తెలిపింది. ఐపీఎల్ ప్రారంభ సమయంలో 2008లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టు కెప్టెన్‌గా వ్యవహరించిన సంగక్కర.. ఆ తర్వాత రెండు సీజన్లు డక్కన్ చార్జర్స్, ఒక సీజన్ సన్‌రైజర్స్ తరపున ఆడాడు. శ్రీలంక జాతీయ జట్టు కెప్టెన్‌గా చిరస్మరనీయమైన విజయాలు కూడా అందించాడు. తనను రాజస్థాన్ రాయల్స్ జట్టు డైరెక్టర్‌గా నియమించడం పట్ల సంగక్కర ధన్యవాదాలు తెలిపాడు. సంగక్కర రాకతో జట్టులో నూతన ఉత్సాహం వస్తుందని సంజూ శాంసన్ అన్నాడు.


Next Story

Most Viewed