ప్రమాదాలకు కారణం.. అందుకే అడ్డుకున్నాం

by  |
ప్రమాదాలకు కారణం.. అందుకే అడ్డుకున్నాం
X

దిశ, మహబూబ్ నగర్ :
తెల్లవారితే చాలు ట్రాక్టర్ల మోత మొదలవుతోంది. భవన నిర్మాణాలకు అవసరమైన ఇసుక సరఫరాకు లాక్‌డౌన్ నుంచి ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. నాటి నుంచి ఇసుక వ్యాపారులు ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేస్తే వారి నుంచి స్పందన కరువైంది. గ్రామంలో విచ్చలవిడిగా తిరుగుతున్న ఇసుక ట్రాక్టర్ల వలన ప్రమాదాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. దీంతో విసుగు చెందిన గ్రామస్థులు శనివారం గ్రామంలోకి వచ్చిన ట్రాక్టర్లను అడ్డుకున్నారు. వారి వివరాల ప్రకారం..జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలం చిన్న తాండ్రపాడులో ఇసుక ట్రాక్టర్ల గోల ఎక్కువైంది. లైసెన్స్ లేని డ్రైవర్లు ట్రాక్టర్లు నడుపుతూ యాక్సిడెంట్లు చేస్తున్నారు. ఇసుకకు ఎలాంటి రక్షణ పరద కట్టకుండా తరలిస్తుండటంతో వెనుక వచ్చే టూ వీలర్ వాహనదారులపై ఇసుక పడి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే రోడ్డు ప్రమాదం వలన గ్రామంలో 5 గురు చనిపోయారు. నేడు సైకిల్ పై వెళ్తున్న బాలుడు, మరో ద్విచక్ర వాహనదారుడు కింద పడటంతో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ విషయంపై ఎన్నిమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తంచేశారు. అలాగే చిన్న తాండ్రపాడు మీదుగా ట్రాక్టర్లు వెళ్లడానికి ఎలాంటి అనుమతులు లేవు. అందుకే ఇసుక ట్రాక్టర్లను అడ్డుకున్నట్టు వారు స్పష్టం చేశారు. ఇకమీదట కూడా ఎవరైనా ట్రాక్టర్‌తో గ్రామంలోనికి వస్తే తప్పకుండా అడ్డుకుంటామని స్థానికులు హెచ్చరించారు.

Next Story

Most Viewed