కనిపించని నాలుగో సింహమే 'దేశం'

by  |
కనిపించని నాలుగో సింహమే దేశం
X

దిశ, వెబ్‌డెస్క్: అమ్మ కడుపులో 9 నెలలు క్వారెంటైన్‌లో ఉండి జన్మ పొందాము… ఏప్రిల్ 14 వరకు క్వారెంటైన్‌లో ఉండి పునర్జన్మ పొందుదామని సినీ ప్రముఖులు పిలుపునిస్తున్నారు. కరోనా నుంచి విముక్తి కలగాలంటే ఇంటికి పరిమితం కావాలని సూచిస్తున్నారు. లాక్ డౌన్‌ పాటించాల్సిన అవసరాన్ని తనదైన శైలిలో వివరించారు డైలాగ్ కింగ్ సాయి కుమార్. తన పాపులర్ డైలాగ్ ‘పోలీస్ స్టోరీ’ మూవీలోని ‘కనిపించే మూడు సింహాలు’ డైలాగ్‌ను ప్రస్తుత పరిస్థితికి తగినట్లు మార్పు చేసి ప్రజలకు అర్ధమయ్యేలా సూచనలు అందించారు.

అందరికీ నమస్కారం… ఇదే మన సంస్కారమన్న సాయికుమార్…. కనిపించే మూడు సింహాలు డాక్టర్లు, పోలీసులు, పారిశుధ్య కార్మికులు అయితే కనిపించని నాలుగో సింహమే మీరు… మీరు అంటే మనం … మనం అంటే దేశమని తెలిపారు. దేశం అంటే మట్టికాదోయ్,… దేశం అంటే మనుషులోయ్…దేశం మనకేం చేసిందనే కన్నా దేశానికి మనమేం చేశామన్నది ముఖ్యమన్నారు. ఇప్పుడు మనం దేశానికి గొప్పగా సేవేమీ చేయక్కర్లేదు.. మన ఇళ్లలో మనం కూర్చుంటే చాలన్నారు. ప్రభుత్వం ఇచ్చిన సూచనలు పాటిస్తూ.. స్వయం నియంత్రణ, శుభ్రత, క్రమశిక్షణతో మీ తల్లిదండ్రులు, భార్యాపిల్లలతో మీ ఇంట్లో ప్రశాంతంగా ఉంటే చాలన్నారు. మీరు బతుకుతూ మిగతావారిని బతకనివ్వాలని కోరారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మనమందరం కలిసి కట్టుగా దేశం కోసం, ప్రపంచం కోసం పోరాడుదామని పిలుపునిచ్చారు. కరోనా వైరస్‌ను తరిమికొట్టి… ఆ మహమ్మారి నుంచి ప్రపంచాన్ని కాపాడుకుందామన్నారు సాయి కుమార్.


Tags: Sai Kumar, Dailogue, CoronaVirus, Covid19

Next Story

Most Viewed