అందని ద్రాక్షలా.. ఆన్‌లైన్ పాఠాలు..

by  |
అందని ద్రాక్షలా.. ఆన్‌లైన్ పాఠాలు..
X

దిశ,భూపాలపల్లి: గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులు ఆటపాటలతో గడిపేస్తున్నారు తప్ప, ఆన్ లైన్ తరగతుల జోలికి వెళ్లడం లేదు. గ్రామాల్లో విద్యార్థుల తల్లిదండ్రులకు చాలామందికి టీవీలు లేని వారు ఉన్నారు. స్మార్ట్ ఫోన్ లేని వారు ఎంతో మంది ఉన్నారు. దీంతో ప్రభుత్వం టీషాట్, డిడి ఛానల్ ద్వారా ప్రసారం అయ్యే తరగతులను వినే అవకాశం లేకుండాపోతుంది. టీవీ మొబైల్ ఉన్న పిల్లలు సైతం ఆటపాటల్లో, తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా మాత్రమే ఉంటున్నారు. జిల్లాలో 44 వేల 79 మంది విద్యార్థులు ఉండగా అందులో 30 శాతం మంది విద్యార్థులు మాత్రమే ఆన్ లైన్ క్లాసులకు హాజరు అవుతున్నట్లు తెలిసింది. మిగతా విద్యార్థులు ఆన్ లైన్ తరగతులకు దూరంగా ఉంటున్నారు.

కరెంటు కటకటలు..

పల్లెల్లో విద్యుత్ సౌకర్యం సైతం ఉండటం లేదు. పగటిపూట విద్యుత్తు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియడం లేదు. ఆన్ లైన్ తరగతులు ఉన్న సమయంలో చాలా వరకు విద్యుత్తు ఉండటం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. జిల్లాలో ప్రభుత్వ, కేజీవీబీ, గురుకుల పాఠశాలల్లోని విద్యార్థులు చాలామంది పేదరికంలో ఉండడంతో టీవీ మొబైల్ లేని వారు చాలా మంది ఉన్నారు. దీంతో కొంతమంది పక్కింటి కి వెళ్లి చూద్దామన్న ప్రతిరోజు వారు వెళ్లే అవకాశం లేకుండాపోతుంది. దీంతో ఆన్ లైన్ క్లాసులు విద్యార్థులకు అందడం లేదు. ప్రైవేట్ యాజమాన్యాలు ఆన్ లైన్ క్లాసులు చెప్పడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ, పల్లెల్లో సిగ్నల్స్ సక్రమంగా లేకపోవడం విద్యార్థులపై నియంత్రణ లేకపోవడంతో ఆన్లైన్ తరగతులు వినేవారు చాలా తక్కువ మందే ఉన్నారు. దీంతో పల్లెల్లో విద్యార్థులు ఆట పాటలకు సై అంటూ, ఆన్లైన్ క్లాస్‌లకు నై అంటున్నారు. ప్రత్యక్ష తరగతులు నిర్వహిస్తే తప్ప విద్యార్థులు చదువుకునే అవకాశం లేదు. గత రెండు సంవత్సరాలుగా విద్యాబోధన సరిగ్గా లేకపోవడంతో విద్యార్థులు తమకు వచ్చిన చదువును మర్చి పోయి ఆటలపై పనులపై దృష్టి సారించారు.

Next Story