లాక్‌డౌన్ ఎఫెక్ట్.. హమాలీలుగా ‘ఆర్టీసీ’ కార్మికులు..

by  |
లాక్‌డౌన్ ఎఫెక్ట్.. హమాలీలుగా ‘ఆర్టీసీ’ కార్మికులు..
X

దిశ, తెలంగాణ బ్యూరో : కరోనా లాక్‌డౌన్​ నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులను హమాలీ కూలీలుగా మార్చేశారు. ప్రస్తుతం కొద్దిమేరకే బస్సులను నడుపుతుండటంతో వారిని ఇతర పనులకు వినియోగిస్తున్నారు. దీంతో ఆర్టీసీ యాజమాన్యంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో ఆర్టీసీలో పార్శిల్, కొరియర్, కార్గో సర్వీసులను ప్రభుత్వ రవాణాకు అవకాశం కల్పించారు.

కార్గో బస్సుల్లో హైదరాబాద్​ నుంచి వివిధ జిల్లాలకు టెక్ట్స్ బుక్కులు, నాచారంలోని తెలంగాణ ఫుడ్స్​నుంచి బాలామృతం బ్యాగులను తరలిస్తున్నారు. అయితే వీటి లోడింగ్, అన్​లోడింగ్​బాధ్యతలన్నీ ఆర్టీసీ కండక్టర్లు, డ్రైవర్లపైనే వేశారు. ఈ సర్వీసులకు వెళ్లేందుకు నిరాకరిస్తే వారిని ట్రాన్స్‌ఫర్ చేస్తామంటూ బెదిరిస్తున్నట్లు ఆర్టీసీ యూనియన్లు ఆరోపిస్తున్నాయి. ప్రస్తుతం బస్సులు నడువడం లేదనే కారణంతో వారిని కార్గో సర్వీసుల పనులకు వినియోగిస్తుండటంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెబుతున్నారు.

దీనిపై తెలంగాణ ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో ఆర్టీసీ ఎండీ.. ప్రభుత్వానికి బుధవారం విజ్ఞప్తి చేశారు. ఈ హమాలీ పనుల నుంచి ఆర్టీసీ కార్మికులకు విముక్తి కల్పించాలని కోరారు.
అదే విధంగా కరోనా లాక్‌డౌన్ ​నేపథ్యంలో ఆర్టీసీలోని నాన్ ఆపరేషన్ యూనిట్లు, డిపో గ్యారేజీల్లో 33 శాతం ఉద్యోగులను మాత్రమే అనుమతించాలని కోరుతున్నారు. డిపోల్లో మొత్తం సిబ్బందితో పని చేయిస్తున్నారని, కానీ తిరిగి వెళ్లాల్సిన సమయంలో ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని ఆర్టీసీ ఎంప్లాయిస్​ యూనియన్​ ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కార్గో సర్వీసుల్లో పని చేస్తున్న వారికి హమాలీ పనుల నుంచి విముక్తి కల్పించాలని, ఆర్టీసీలో 33 శాతం ఉద్యోగుల హాజరు వర్తింప చేయాలని ఆర్టీసీ యాజమాన్యానికి వినతిపత్రం సమర్పించినట్లు రాజిరెడ్డి తెలిపారు.



Next Story

Most Viewed