కల్లాల వద్దకే ‘కార్గో’ సేవలు 

by  |
కల్లాల వద్దకే ‘కార్గో’ సేవలు 
X

దిశ ప్రతినిధి, ఖమ్మం: ఆర్టీసీ కార్గో సేవలు రైతులకు చేరవయ్యాయి. పంట దిగుబడులను మార్కెట్లకు చేరవేసేందుకు నేరుగా కల్లాల వద్దకే బస్సులు వెళ్తున్నాయి. ప్రస్తుతం మిరప సీజన్‌ నడుస్తుండడంతో గ్రామాలకు వెళ్తూ ప్రైవేట్‌ వాహనాల కంటే తక్కువ ధరకే సరుకు రవాణా చేస్తున్నాయి. వివిధ అవసరాల కోసం వ్యాపారులు హైదరాబాద్‌, వరంగల్‌ నగరాలకు వెళ్లకుండానే ఆయా ప్రాంతాల నుంచి నేరుగా కొరియర్‌ ద్వారా ఈ సేవలను వినియోగించుకుంటున్నారు. ఇప్పుడు కార్గో సేవలు అన్నదాతలకు కూడా కలిసివస్తున్నాయి. మంత్రి పువ్వాడ ప్రత్యేక కృషితో ఆర్టీసీ సేవలు నేరుగా గ్రామాల వద్దకే రావడంతో తమకు వ్యయప్రయాసలు తగ్గాయని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మిర్చి రైతులకు మేలు..

భూపాలపల్లి జిల్లా మల్హర్‌ మండలంలో పూర్తిగా వ్యవసాయాధారిత గ్రామాలే ఎక్కువ. ఇక్కడ మిర్చి పండించే రైతులు పంటను వరంగల్‌ మార్కెట్‌కు తరలించేందుకు ఎన్నో ఇబ్బందులు పడేవారు. వాహన సౌకర్యం కోసం రోజుల తరబడి ఎదురుచూసేవారు. ఇప్పుడు కార్గో వచ్చాక ఆ సమస్యలన్నీ తీరిపోయాయి. మండలంలోని ఏ గ్రామంలో అయితే మిర్చి పండించిన రైతులు ఉంటారో అక్కడికే కార్గో బస్సు నేరుగా వెళ్తున్నది. ఇందుకోసం ముందుగా సమీప ఆర్టీసీ డిపోలో సదరు రైతు బుక్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత గ్రామానికి నేరుగా కార్గో వస్తుంది. గతంలో ప్రైవేట్‌ వాహనాల ద్వారా వరంగల్‌ తీసుకెళ్లాలంటే ఒక్కో మిర్చి బస్తాకు రూ.80 వరకు ఖర్చయ్యేది. ఇప్పుడు కార్గో ద్వారా ఒకేసారి 150 బస్తాలు తీసుకెళ్తే బస్తాకు కేవలం రూ.50 చార్జి తీసుకుంటారు. అంతకంటే తక్కువ ఉంటే బస్తాకు రూ.60 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ప్రైవేట్‌తో పోల్చితే కార్గోతో రవాణా ఖర్చులు చాలా తక్కువవుతున్నాయని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

పుష్కలంగా ఆదాయం..

ఆర్టీసీలో ఏర్పాటు చేసిన కార్గో (పార్సిల్‌, కొరియర్‌) సేవలు సంస్థకు ఆదాయాన్ని తీసుకువస్తున్నాయి. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడంలో నెంబర్‌వన్‌గా నిలిచిన సంస్థ పార్సిల్‌, కొరియర్‌ సేవలను అందించడంలోనూ ముందంజలో ఉంది. గతేడాది జూన్‌ 19న ఉమ్మడి జిల్లాలో సేవలు ప్రారంభించగా, ఇప్పటివరకు రూ.1.65 కోట్ల ఆదాయం వచ్చింది. దీనిలో ఖమ్మం, మధిర, సత్తుపల్లి, కొత్తగూడెం, భద్రాచలం, మణుగూరు డిపోల్లో కార్గో, పార్సిల్‌, కొరియర్‌ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఖమ్మం డిపో నుంచి రూ.60 లక్షలు, మధిర డిపో రూ.7.90 లక్షలు, సత్తుపల్లి డిపో రూ.34 లక్షలు, కొత్తగూడెం డిపో రూ.22.30 లక్షలు, భద్రాచలం రూ.28 లక్షలు, మణుగూరు డిపో రూ.7.10 లక్షలు ఆదాయం వచ్చింది. ఇప్పటివరకు 1,65,110 కొరియర్‌, పార్సిల్‌, పెరిసబుల్‌ వస్తువుల రవాణా జరిగింది. ఖమ్మం డివిజన్‌లో 1,10,840 పార్సిల్‌, కొరియర్‌, పెరిసబుల్‌ సేవల ద్వారా రూ.కోటి, భద్రాద్రి కొత్తగూడెం డివిజన్‌లో 54,300 పార్సిల్‌, కొరియర్‌, పెరిసబుల్‌ సేవల ద్వారా రూ. 60 లక్షల ఆదాయం సమకూరింది. ప్రతిరోజూ సగటున ఉమ్మడి జిల్లాలో 500కు పైగా పార్సిల్స్‌ రవాణా అవుతున్నాయి. చిరు వ్యాపారులు, హోల్‌సేల్‌ వ్యాపారులు, కూరగాయల వ్యాపారులు, డెకరేషన్‌ చేసే యజమానులు కార్గో ఉపయోగించుకుంటున్నారు. హైదరాబాద్‌, విజయవాడ నుంచి ఉమ్మడి జిల్లా వ్యాపారులు తమకు కావాల్సిన వస్తువులను ఆర్టీసీ సర్వీస్‌ ద్వారా తెప్పించుకుంటున్నారు.

మంచి స్పందన ఉంది..

-వేములవాడ కృష్ణ, భదాద్రి కొత్తగూడెం డివిజనల్‌ మేనేజర్‌
ఆర్టీసీ ఏర్పాటు చేసిన కార్గో, పార్సిల్‌, కొరియర్‌ సేవలకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తున్నది. సంస్థ ఆదాయాన్ని పెంచుకునేందుకు ఏర్పాటు చేసిన ఈ సేవలు అదనపు ఆదాయాన్ని ఇస్తుంది. ఆర్టీసీపై ప్రజలకు ఉన్న నమ్మకం వల్లనే ఇది సాధ్యమైంది.



Next Story

Most Viewed