RTC బస్సులో ఇలాంటి ప్రయాణం ప్రమాదకరం..

by  |
RTC బస్సులో ఇలాంటి ప్రయాణం ప్రమాదకరం..
X

దిశ,వనస్థలిపురం: కొవిడ్ శాంతించిన వేళ ప్రజా జీవన విధానాలు ఊపందుకున్నాయి.. దానికి తోడు పాఠశాలలు, కళాశాలలు, విద్యా సంస్థలు తెరుచుకున్నాయి. ఉపాధి కోసం కార్మికులు, కూలీలు పెద్ద ఎత్తున ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. ఇన్నాళ్లు ఇంటికే పరిమితమై ఆన్లైన్ తరగతుల్లోనే గడిపిన విద్యార్థులు చదువును గాడిలో పెట్టడానికి పాఠశాలలకు వెళ్లడాని ఆర్టీసీ బస్సులో ప్రయాణాలు సాగిస్తున్నారు.

గమ్యం వరకూ నిలిచే..

ఆర్టీసీ యంత్రాంగం మాత్రం సరిపడా బస్సులు నడపక.. సామాన్య ప్రజలను మొదలుకొని విద్యార్థులను తీవ్ర వ్యయప్రయాసలకు గురి చేస్తోంది. కిక్కిరిసిన జనాభాతో గల బస్సు వనస్థలిపురంలో కనిపించింది. బస్సు ఎక్కినప్పటి నుంచి ప్రయాణికులు గమ్యం చేరే వరకూ నిలిచి ఉండే దుస్థితి ఉంది. ఆర్టీసీకి ఆదాయం సమకూర్చాలన్న లక్ష్యంతో జనం పట్ల యజమాన్యం నిర్లక్ష్యం వహిస్తోంది.

బాధ్యులెవరు?..

అరవై సీట్ల సామర్థ్యం గల బస్సులో ప్రయాణికులను గొర్లమందలా తరలిస్తున్నారు. ముందు నుంచి వెనక్కి వరకూ 70 నుంచి 80 మందిని ఎక్కిస్తున్నారు. విద్యార్థులు, యువత ఫుట్ బోర్డు ప్రయాణం చేస్తున్నారు. అధికారులు మాత్రం పట్టనట్టు చోద్యం చూస్తున్నారు. తప్పని పరిస్థితుల్లో ప్రయాణించాల్సి వస్తోందని పేద, మధ్యతరగతి విద్యార్థులు, సామాన్యులు వాపోతున్నారు. ఫుట్ బోర్డు ప్రయాణంలో జరగరానిది జరిగితే బాధ్యులెవరని ప్రశ్నిస్తున్నారు. సరిపడా బస్సులు నడపాలని కోరుతున్నారు.


Next Story