భార్యాపిల్లలను ఆ మాటలు అంటే మహా క్రూరత్వం : హైకోర్టు

by Dishanational4 |
భార్యాపిల్లలను ఆ మాటలు అంటే మహా క్రూరత్వం : హైకోర్టు
X

దిశ, నేషనల్ బ్యూరో : వివాహేతర సంబంధం కలిగి ఉన్నారని జీవిత భాగస్వామిపై తప్పుడు ఆరోపణలు చేయడం, ఆ కారణంతో పిల్లలను తల్లిదండ్రులు నిరాకరించడం తీవ్ర మానసిక క్రూరత్వమని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. తన భార్య క్రూరంగా ప్రవర్తిస్తున్నందున ఆమె నుంచి విడాకులు ఇప్పించాలంటూ ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ను ఫ్యామిలీ కోర్టు తిరస్కరించింది. దీన్ని సవాలు చేస్తూ సదరు వ్యక్తి ఢిల్లీ హైకోర్టులో అప్పీల్ పిటిషన్ వేశాడు. దీన్ని విచారించిన న్యాయమూర్తులు జస్టిస్ సురేష్ కుమార్ కైత్, జస్టిస్ నీనా బన్సల్ కృష్ణలతో కూడిన హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పును వెలువరించింది. విడాకుల పిటిషన్‌‌ను ఫ్యామిలీ కోర్టు తిరస్కరించడాన్ని సమర్థించింది. ‘‘భర్త స్థానంలో ఉన్న వ్యక్తి భార్యపై నిరాధార ఆరోపణలు చేయడం తగదు. ముఖ్యంగా ఆమె క్యారెక్టర్‌పై ప్రశ్నలు లేవనెత్తడం సరికాదు. ప్రస్తుత కేసులో భర్త ఈ తప్పులన్నీ చేశాడు. చివరకు పిల్లలు తనకు పుట్టలేదన్నాడు. ఇలాంటి మాటలు అతడి భార్యను తీవ్ర మానసిక వేదనకు గురిచేస్తాయి. వారి వివాహ బంధాన్ని కోలుకోలేని విధంగా దెబ్బతీస్తాయి’’ అని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ‘‘ఈ కేసులో భర్త క్రూరత్వాన్ని భార్య అనుభవించింది’’ అని పేర్కొంది. ఇలాంటి కారణాలపై విడాకులు పొందేందుకు సదరు వ్యక్తికి అర్హత లేదని బెంచ్ స్పష్టం చేసింది. విచారణ సమయంలో సదరు వ్యక్తి తన భార్య అనేక మంది పురుషులతో సంబంధం కలిగి ఉందని ఆరోపించాడు. అయితే, ఆమె, ఇతర పురుషులతో ఉండగా తాను చూడలేదని క్రాస్ ఎగ్జామినేషన్‌లో అంగీకరించాడు.



Next Story

Most Viewed