నన్ను ఇబ్బందులకు గురి చేశారు.. కేసీఆర్‌పై RSP సంచలన కామెంట్స్

by  |
నన్ను ఇబ్బందులకు గురి చేశారు.. కేసీఆర్‌పై RSP సంచలన కామెంట్స్
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో పాలకులు తనను ఎన్నో ఇబ్బందులకు గురిచేశారని, అయినా కేసీఆర్‌తో సంబంధం లేకుండా తన విధులు తాను నిర్వర్తించినట్లు మాజీ ఐపీఎస్, బీఎస్పీ స్టేట్​కోఆర్డినేటర్​ఆర్ఎస్ ప్రవీణ్​కుమార్​కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్​తార్నాకలో పూలే-అంబేద్కర్​ఆలోచనా సమితి ఆధ్వర్యంలో స్టేట్​బీసీ యూత్​కాన్ఫరెన్స్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ఎస్​ప్రవీణ్​కుమార్​హాజరై మాట్లాడారు. సీఎం కేసీఆర్, ప్రధాని మోడీ పేద విద్యార్థులకు విద్యను అందకుండా దూరం చేస్తున్నారని విమర్శలు చేశారు. కేసీఆర్​గురుకులాల అభివృద్ధికి బడ్జెట్ కేటాయించలేదని, ఇచ్చిన కొంచెం కూడా భిక్షం వేసినట్లు పడేశారన్నారు.

తనను ఎన్నో కష్టాలకు గురిచేశారని ఆయన చెప్పుకొచ్చారు. మెడకాయ మీద తలకాయ ఉన్న సీఎం.. విద్యకు ప్రాముఖ్యత ఇవ్వాలని ఆర్ఎస్​ప్రవీణ్​కుమార్​డిమాండ్​చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు విద్యనందించాలనే చిత్తశుద్ధి ఉందా అని ఆయన ప్రశ్నించారు. ఇన్నేండ్ల పాలనలో కేసీఆర్​ఏనాడైనా ఒక్క యూనివర్సిటీకైనా వెళ్లారా, కనీసం విద్యాశాఖపై సమీక్ష నిర్వహించారా అని ప్రశ్నల వర్షం కురిపించారు. పాలకులు బహుజనులను ఎదగకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంబీసీ కార్పొరేషన్‌కు నాలుగేళ్లలో 2,744 కోట్లు కేటాయిస్తే రూ.7 కోట్లు మాత్రమే విడుదల చేశారన్నారు. అరకొరగా పదవులిస్తే సరిపోతుందా.. అభివృద్ధికి నిధులొద్దా అని కేసీఆర్‌ను ప్రశ్నించారు. బహుజనులు సామాజిక, రాజకీయ అంశాలపై అవగాహన కలిగి ఉండాలని ఆయన ప్రవీణ్​కుమార్ ఆకాంక్షించారు.

కేంద్ర, రాష్ట్ర పాలకుల సెంటి‌మెంట్‌లో బహుజనులు పడొద్దని సూచించారు. బహుజనులకు తరతరాలుగా జరుగుతున్న అన్యాయాన్ని గ్రామ గ్రామాల్లోకి తీసుకుపోవాలని ఆర్‌ఎస్పీ అన్నారు. పాలకులు వేలకోట్లు సంపాదించుకున్నారు.. వాళ్లతో మనం పోటీ పడతామా అని ఎవరూ నిరాశతో వెనుకడుగేయొద్దు. 75 ఏళ్ల నుంచి ఇదే జరుగుతోందని, ఇవన్నీ ప్రజలకు చెప్పి వారిని చైతన్యవంతుల్ని చేయాలన్నారు. బహుజన రాజ్యం గురించి ఎంత మంది కుటుంబ సభ్యులకు తెలియజేశారని ఆర్ఎస్పీ ప్రశ్నించారు. ఓటుకు రూ.6 వేలు, దళిత బంధుకు రూ.10 లక్షలు అనగానే నమ్మి మోసపోవద్దని ఆయన సూచించారు. డబ్బు మత్తులో కొట్టుకుపోతే బహుజన రాజ్యం రాదని, అందుకే అందరం కష్టపడి బహుజన రాజ్యం కోసం పని చేయాల్సిన అవసరముందని వివరించారు.

పాలకులు రాజ్యాంగాన్ని బేఖాతరు చేస్తున్నారని, ఆర్టీఐపై ఆంక్షలు విధించడం ఫాసిస్ట్ పాలనకు నిదర్శనమని మండిపడ్డారు. ప్రభుత్వం జీవోలను కూడా దాచిపెడుతోందని, రహస్యంగా విడుదల చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజల్లో ఓటు చైతన్యం రావాలని, బహుజన రాజ్యం అవశ్యకత తెలుసుకోవాలని సూచించారు. పాలకులు సాగునీటి ప్రాజెక్టుల ద్వారా వేల కోట్లు సంపాదించారని, ప్రజలకు ఎల్లమ్మ, పోచమ్మ గుడులు కట్టించి ఓట్లు వేయించుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 25 శాతం ముదిరాజ్, 14 శాతం యాదవులున్నప్పటికీ కేవలం 3 శాతం ఉన్న రెడ్డీలు నర్సాపూర్ నియోజకవర్గాన్ని ఏలుతున్నారన్నారు. దాదాపుగా రాష్ట్రం, దేశం మొత్తంలో ఇదే పరిస్థితి కనిపిస్తోందన్నారు. దీనిని కచ్చితంగా మార్చాలని ఆయన పిలుపునిచ్చారు.

డిజిటల్ మీడియాలో నేర్చుకున్న నైతికతను కుటుంబాలు, సమాజంతో పంచుకోవాలని ఆయన సూచించారు. ఎన్నికల ముందు వచ్చి భుజం మీద చెయ్యి వేసి ఇంట్లో భోజనం చేస్తే కరిగిపోవద్దని, బహుజన రాజ్యం వస్తేనే మన స్థితిగతులు మారుతాయని ఆర్‌ఎస్పీ వెల్లడించారు. ముస్సోలిని నుంచి మోడీ, కేసీఆర్ వరకు కరుడుగట్టిన నియంతలని.. వీళ్లు రాజ్యాంగ, ప్రజాస్వామ్య సంస్థలను పని చేయనివ్వరని ఆర్ఎస్​ప్రవీణ్​కుమార్​ఫైరయ్యారు. బహుజనులకు జరుగుతున్న అన్యాయం గురించి తెలియాలంటే చదువొక్కటే మార్గమని ఆయన సూచించారు.


Next Story

Most Viewed