కొత్త సెల్‌ఫొన్స్.. రూ.30లక్షల ప్రతిపాదన!

by  |
కొత్త సెల్‌ఫొన్స్.. రూ.30లక్షల ప్రతిపాదన!
X

బల్దియా పరిధిలోని ప్రజావసరాలకన్నా.. కార్పొరేటర్ల హంగులకే ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. మొబైల్ ఫోన్లు కొనాలని ఎజెండాగా పెట్టుకున్నారు. రేపు జరగనున్న జనరల్ బాడీ మీటింగ్‌లో రూ.30 లక్షలు వెచ్చించాలని ప్రతిపాదనలు చేశారు. 60 డివిజన్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక్కో కార్పొరేటర్‌కు రూ.50 వేల చొప్పున మొబైల్ కొనాలని నిర్ణయించడం విస్మయం కల్గిస్తోంది. ఒకవేళ ఆన్‌లైన్ సేవల కోసం కొనుగోలు చేయాలని భావిస్తే గత పాలకవర్గం కొన్న ట్యాబ్‌లు ఏమయ్యాయి.? ఆ ట్యాబ్‌లు వారి నుంచి తిరిగి ఎందుకు తీసుకోలేదని ప్రతిపక్ష కార్పొరేటర్లు ప్రశ్నిస్తున్నారు.

దిశ ప్రతినిధి, కరీంనగర్ :

వాహనాల రిపేర్లకు రూ. 20 లక్షలు..

ఈ ఏడాది జనవరి నుంచి మే వరకు మున్సిపల్ వాహనాల రిపేర్లకు రూ.20.60 లక్షలు ఖర్చు చేశామని తీర్మాన అంశం నెంబరు 31 ప్రకారం ఏజెండాలో పేర్కొన్నారు. 34వ అంశంలో ఈ ఏడాది జులై నుంచి డిసెంబర్ వరకు రూ.15 లక్షలు ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయని ఇం దుకు అనుమతి కోసం తీర్మానం ప్రవేశపెట్టాలని నిర్ణయించడం విస్మయం కల్గిస్తోంది. బల్దియా ఎన్నికలు సక్సెస్ చేసినందుకు మున్సిపల్ యంత్రాంగానికి ప్రత్యేకంగా గెట్ టు గెదర్ ఏర్పాటు చేశామని ఇందుకు రూ. 4 లక్షల 3 వేల రూపాయలు ఖర్చు అయ్యయాని చెప్తున్నారు.

మున్సిపల్ కమిషనర్ క్యాంప్ ఆఫీసు రినోవేషన్‌లో భాగంగా వాల్ పేయింటింగ్, ఫ్లోరింగ్, టైల్స్, స్లైడింగ్ డోర్స్ ఎలక్ట్రికల్ పనుల కోసం రూ. 4.91 లక్షలు ఖర్చు, మాడిఫికేషన్ ఆఫ్ కమిషనర్ క్యాంప్ ఆఫీసులో భాగంగా ఇంటర్నల్ పార్టిషన్స్ వంటి పనుల కోసం రూ.3.85 లక్షలు ఖర్చు అయినట్లు ఎజెండాలో పేర్కొన్నారు. మొత్తం రూ.8.76 లక్షల ఖర్చు అయినట్లు వివరించారు. అయితే జిల్లా రెవెన్యూ విభాగం పరిధిలో కరీంనగర్ కమిషనర్ నివాసం ఉంటున్నారు. సంబంధం లేని శాఖకు సంబంధించిన క్వార్టర్ మెయింటెనెన్స్ కోసం బల్దియా నిధులు ఎలా వెచ్చించారోనన్నది అర్థం కాకుండా పోయింది.

గందరగోళంగా ఖర్చులు..

ఖర్చుల వివరాలు అంతా గందరగోళంగా ఉన్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. మొదట 90 మిల్లీ లీటర్ల శానిటైజర్ సీసాలు 2 వేలు కొనుగోలు చేస్తే రూ. లక్షా 38 వేల 670 వెచ్చించామని, 90 మిల్లీ లీటర్ల 2,520 బాటిళ్లు మరోసారి కొనుగోలు చేశామని ఇందుకు రూ. 3.52 లక్షలు ఖర్చుచేసినట్లు చెప్పారు. కరోనా సీజన్‌లో ఒకే వ్యాపారి వద్ద రెండు సార్లు కొన్న శానిటైజర్ బాటిల్ల ధర రెట్టింపు కావడం విస్మయం కలిగిస్తోంది. మొదట కొనుగోలు చేసినప్పుడు ఒక్కో బాటిల్‌కు రూ. 70 ధర పెట్టి కొంటే, రెండోసారి కొన్నప్పుడు మాత్రం రూ. 140 చొప్పున చెల్లించడం గమనార్హం.

55వ అంశంలో వీటిని కొనుగోలు చేశామని వివరించగా 119వ అంశంలో గత నాలుగు మాసాల్లో అయిన ఖర్చుల వివరాల్లో రూ. 97, 640 తో బ్లీచింగ్ ఫౌడర్ కొనుగోలు చేశామంటున్నారు. అలాగే కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ఓ సారి రూ. 95,500, మరోసారి రూ. 9 లక్షల 60 వేలతో బ్లీచీంగ్ ఫౌడర్ కొన్నట్టు వివరించారు. ఇదే ప్రతిపాదనల్లో రూ. 99 వేలతో అల్కాహాలిక్ హైండ్ శానిటైజర్ కొనుగోలు చేశామని తెలిపారు. బల్దియా అధికారులు ఇష్టారాజ్యంగా పొందు పర్చిన అంశాలు ఇవి మచ్చుకు మాత్రమే. లోతుగా అధ్యయనం చేస్తే మరిన్నిలోసుగులు బయటపడే అవకాశాలు లేకపోలేదు.

హైమాస్ట్ లైట్లు పేరిట..

ఇకపోతే గతంలోనే హైమాస్ట్ లైట్లతో కరెంటు ఛార్జీలు ఎక్కువగా వస్తున్నాయని కార్పోరేషన్ కు ఆర్థిక భారం తగ్గించాలన్న యోచనతో ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అప్పుడు హైమాస్ట్ లైట్లకు సంబందించిన పోల్స్ కూడా తొలగించారు. ఇప్పడు తాజాగా రూ.20 లక్షల 55 వేల రూపాయలతో మళ్లీ హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు చేయడం విడ్డూరంగా ఉంది. అప్పటి పాలకవర్గం సమయంలో కరెంటు ఛార్జీలు ఎక్కువగా వస్తాయని భావించి తొలగించిన హైమాస్ లైట్లను మళ్లీ ఏర్పాటు చేయాలన్న ప్రపోజల్ చేయడం విస్మయం కల్గిస్తోంది.

Next Story

Most Viewed