బడ్జెట్‌లోనే దళితలకు రూ.1,000 కోట్లు కేటాయించాం

by  |
Boinapalli Vinod Kumar
X

దిశ, తెలంగాణ బ్యూరో : దళిత ఎంపవర్మెంట్ కోసం ప్రభుత్వం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనే రూ.1,000 కోట్లు కేటాయించిందని, దళిత బంధు పథకం ఆరు నెలల క్రితమే రూపుదిద్దుకుందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ స్పష్టం చేశారు. ఆదివారం రవీంద్రభారతిలో సాంస్కృతిక సారథి కళాకారుల అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. దళితుల అభ్యున్నతి కోసం సీఎం గత కొంత కాలంగా వ్యూహ రచన చేస్తున్నారన్నారు. దళితుల విస్తృత ఆర్థిక, సామాజిక ప్రయోజనం కోసం కేసీఆర్ పరితపించి ‘ దళిత బంధు ‘ పథకాన్ని రూపకల్పన చేశారని ఆయన గుర్తు చేశారు.

కొత్తగా పుట్టుకొచ్చిన పథకం కాదని, రాజకీయ కోణం ఇందులో ఏమీ లేదని, కేవలం దళితుల అభ్యున్నతిని కాంక్షించే ప్రభుత్వం రూపకల్పన చేసినట్లు వివరించారు. కొవిడ్ ప్రభావం ఎక్కువగా ఉండటంతోనే ఈ పథకం అమలులో జాప్యం జరిగిందని, ‘ రైతు బంధు ‘ పథకాన్ని కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌లో లాంఛనంగా ప్రారంభించినట్లే.. ‘ దళిత బంధు ‘ పథకాన్ని కూడా అక్కడి నుంచే ప్రారంభించాలని సీఎం నిర్ణయాన్ని తీసుకున్నారని పేర్కొన్నారు. ఇందులో ఎలాంటి రాజకీయాలకు ఆస్కారం లేదని, వాస్తవాలను ప్రతి ఒక్కరూ గమనించాలని కోరారు.

తెలంగాణ ఉద్యమంలో కళాకారులు పోషించిన పాత్ర మరువలేనిదని, స్వరాష్ట్రం సిద్ధించగానే సాంస్కృతిక సారథి సంస్థ ద్వారా కళాకారులకు ఉద్యోగాలు కల్పించిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాల్సిన గురుతర బాధ్యత సాంస్కృతిక సారథి కళాకారుల భుజస్కంధాలపై ఉందని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే, సాంస్కృతిక సారథి సంస్థ చైర్మన్ రసమయి బాలకిషన్, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ డాక్టర్ మామిడి హరికృష్ణ, కళాకారులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed