మన్యంలో మావోయిస్టుల అలజడి.. రోడ్డు రోలర్ దగ్ధం

by  |
road-roller1
X

దిశ, ఏటూరునాగారం: ఏటూరునాగారం ఏజెన్సీలో మావోయిస్టుల అలజడి మళ్లీ మొదలైంది. మండలంలోని రొయ్యూర్ రోడ్డు పనులకు సంబంధించిన రోడ్డు రోలర్ ని మావోయిస్టులు శనివారం దగ్ధం చేశారు. వివరాల్లోకి వెళితే.. ఏటూరునాగారం- తుపాకులగూడెం ప్రధాన రహదారి విస్తరణ పనులను సాయిదత్తా కన్స్ ట్రక్షన్ అనే ఓ ప్రయివేట్ సంస్థ నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే రోడ్డు రోలర్ ను రోడ్డు మరమ్మతు పనులు అవుతున్న రోడ్డు పక్కన ఉంచారు. దీంతో మావోయిస్టు పీఎల్ జీఏ వారోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో వారు తమ ఉనికిని చాటేందుకు శనివారం తెల్లవారుజామున రోడ్ రోలర్ ని దగ్ధం చేశారు. ఘటనా స్థలంలో పీ ఎల్ జీ ఏ(పీపుల్స్ గెరిల్లా ఆర్మీ) వారోత్సవాలు జయప్రదం చేయాలని ఏటూరునాగారం-మహాదేవపూర్ ఏరియా కమిటీ పేరుతో కరపత్రాలను వదిలి వెళ్లారు. అయితే ఇదివరకే రోడ్డు రోలర్ షార్ట్ సర్క్యూట్ తో దగ్ధం అయినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం కాగా రోడ్డు రోలర్ పక్కన ఉన్నటువంటి కరపత్రాలను చూస్తే మావోయిస్టులే దగ్ధం చేసినట్లుగా ప్రచారం జోరుగా జరుగుతుంది. రోడ్డు రోలర్ ని మావోయిస్టులు దగ్ధం చేశారా లేదా షార్ట్ సర్క్యూట్ తో దగ్ధమైందా అనే విషయాన్ని స్థానిక పోలీసులు మాత్రం ధ్రువీకరించలేదు. ఏది ఏమైనప్పటికీ ఈ ఘటనతో మన్యంలో మావోల అలజడి మళ్లీ మొదలైంది.


Next Story

Most Viewed