పెళ్లి డప్పు మోగాల్సిన ఇంట్లో చావు డప్పు

by  |
పెళ్లి డప్పు మోగాల్సిన ఇంట్లో చావు డప్పు
X

దిశ, గూడూరు(కేసముద్రం): మరో పది రోజుల్లో పెళ్లి డప్పు మోగాల్సిన ఆ ఇంట్లో చావు డప్పు మోగింది. వివాహ వేడుక సంబంధించిన పెళ్లి బట్టలను కొనేందుకు గూడూరు నుండి నర్సంపేటకు వెళుతుండగా మార్గమధ్యలో లారీ వారిని మృత్యు రూపంలో వెంటాడింది.

వివరాల్లోకి వెళితే.. గూడూరు మండలంలోని బొద్దుగొండ గ్రామ పంచాయితీ శివారు ఎర్ర కుంట తండాకు చెందిన జాటోత్ ప్రమీల (22) వివాహం ఫిబ్రవరి 10వ తేదీన జరగనుంది. ఈ క్రమంలో శుక్రవారం ప్రమీలతో పాటు తల్లి కల్యాణి(45), అన్నయ్య ప్రదీప్ (28), చిన్నాన్న ప్రసాద్(38), చిన్నమ్మ జాటోత్ లక్ష్మి(35) లు అదే తండాకు చెందిన జాటోత్ రాము (35) ఆటోలో పెళ్లి బట్టలు కొనుగోలు చేసేందుకు నర్సంపేటకు వెళుతున్నారు. నర్సంపేట నుంచి గూడూరు వైపునకు వస్తున్న లారీ , వారు ప్రయాణిస్తున్న ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌తో సహా ఐదుగురు అక్కడిక్కడే మృతి చెందారు. ఆటో నుజ్జు నుజ్జు కాగా కొన్ని మృతదేహాలు చిధ్రమయ్యాయి. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు దుర్మరణం చెందడంతో ఎర్ర కుంట తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story

Most Viewed