తేజస్వీని సీఎం చేయండి : ఆర్జేడీ

by  |
తేజస్వీని సీఎం చేయండి : ఆర్జేడీ
X

పాట్నా: అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలో ఆరుగురు జేడీయూ ఎమ్మెల్యేలు బీజేపీలోకి ఫిరాయించడంతో బిహార్ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. బీజేపీ, జేడీయూల మధ్య విభేదాలను అవకాశంగా తీసుకొని ఆర్‌జేడీ లబ్ధి పొందే ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇందులో భాగంగా సీఎం నితీశ్‌కుమార్‌కు ఆ పార్టీ బంపర్ ఆఫర్ ఇచ్చింది. తేజస్వీ యాదవ్‌ను బిహార్ ముఖ్యమంత్రి చేయడానికి సహకరించాలని, అందుకు బదులుగా నితీశ్‌కుమార్‌ను 2024 లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాన మంత్రి అభ్యర్థిత్వానికి ఆర్‌జేడీ మద్దతు ఇస్తుందని సూచించింది. ఈ ప్రతిపాదన‌ను ఆర్‌జేడీ సీనియర్ నేత, శాసనసభ మాజీ స్పీకర్ ఉదయ్ నారాయణ్ చౌదరి తెరపైకి తీసుకువచ్చారు.

నితీశ్ కుమార్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని, తేజస్వీ యాదవ్‌ను సీఎం పీఠంపై కూర్చోపెట్టాలని సూచించారు. జాతీయ స్థాయిలో నితీశ్‌ను ప్రతిపక్ష నేతగా చేస్తామన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఆయన ప్రధాన మంత్రి అభ్యర్థిత్వాన్ని బలపరుస్తామని తెలిపారు. ఆర్‌జేడీ ప్రతిపాదనపై జేడీయూ తీవ్రంగా స్పందించింది. అధికారాన్ని హస్తగతం చేసుకోవడం కోసం ఆర్‌జేడీ ఏమైనా చేస్తుందని మరోసారి రుజువైందని పేర్కొన్నారు. ఉదయ్ నారాయణ్ చౌధరి ప్రతిపాదన వెనుక తేజస్వీయాదవ్ ఉన్నారని ఆరోపించారు. ఆర్‌జేడీ అధికారం దక్కదని తెలిపారు. బీజేపీ, జేడీయూ మధ్య విభేదాలు ఉన్న మాట వాస్తవమేనని కానీ, వచ్చే ఐదేండ్లు బిహార్ సీఎం నితీశ్‌కుమార్ ఉంటారని పేర్కొన్నారు.

Next Story

Most Viewed