కృష్ణానదికి పెరుగుతున్న వరద నీరు

by  |
river krishna
X

దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: ఉమ్మడి పాలమూరు జిల్లాలో గత నాలుగైదు రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల జనజీవనం స్తంభించింది. గురువారం వర్ష తీవ్రత కొంత పెరగడంతో ఉమ్మడి పాలమూరు జిల్లాలో చెరువులు కుంటల్లోకి పెద్ద ఎత్తున నీరు వచ్చి చేరుతోంది. మరోవైపు కర్ణాటకలోని నారాయణపురం ప్రాజెక్టు నుండి పెద్ద ఎత్తున నీటిని విడుదల చేసిన నేపథ్యంలో లక్షా ఇరవై వేల క్యూసెక్కుల నీరు జిల్లాకు చేరుతోంది. ఈ నీటికి తోడు గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో కృష్ణా నదీ ప్రవాహ తీవ్రత గంట గంటకు పెరుగుతోంది.

మరో రెండు మూడు రోజులపాటు పెద్ద ఎత్తున వర్షం కురిసే అవకాశాలు ఉండడంతో అధికారులు ముందస్తుగా అప్రమత్త చర్యలు చేపడుతున్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, చిట్టెం రామ్మోహన్ రెడ్డి, అబ్రహం, కృష్ణమోహన్ రెడ్డి తదితరులు ఎటువంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కోవడానికి అధికారులు, ప్రజా ప్రతినిధులు, పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ వెంకట్రావు, నారాయణపేట కలెక్టర్ హరిచందన, ఆయా జిల్లాల ఎస్పీలు పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు. నదీతీర గ్రామాలలో పర్యటించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు, సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.


Next Story

Most Viewed