RFCL గ్యాస్ లీకేజీకి కారణాలు ఇవే..

by  |
RFCL గ్యాస్ లీకేజీకి కారణాలు ఇవే..
X

దిశ ప్రతినిధి, కరీంనగర్ : తెలంగాణ రాష్ట్రానికి మణిహారంగా నిలవనున్న రామగుండం ఫెర్టిలైజర్ కంపెనీ ప్రారంభానికి మరింత ఆలస్యం అయ్యేట్లు ఉంది. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం జరిపిన ఈ ప్లాంట్ వల్ల భవిష్యత్‌లో పలు ఇబ్బందులు తలెత్తుతాయని అధికారులు నివేదిక తేల్చింది. ఇటీవల వరసగా రెండురోజుల పాటు ఎరువుల కర్మాగారంలో అమ్మోనియా గ్యాస్ లీకేజ్‌పై కొత్త కోణాలు వెలుగులోకి వచ్చాయి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, ఫ్యాక్టరీస్ ఇన్స్‌పెక్టర్ ఆఫీసు అధికారులు ఇచ్చిన రిపోర్టులో నివ్వెరపోయే నిజాలు వెలుగుచూశాయి.

RFCL ప్లాంట్‌లో టెక్నాలజీ ఫెయిల్యూర్‌తో వెలువడిన అమ్మోనియా, కార్బన్ డై యాక్సైడ్ మిక్సర్‌ను యాజమాన్యమే బయటకు వదిలినట్లు బట్ట బయలైంది. మిషనరీని కాపాడుకునేందుకు ప్రజల ప్రాణాలను పణంగా పెట్టెలా గ్యాస్‌ను వదిలారని ఫ్యాక్టరీ శాఖ, పొల్యూషన్ బోర్డు విచారణలో వెల్లడించింది. లోపాలను సరిచేసిన తరువాత పరిశ్రమలో ఉత్పత్తి ప్రక్రియ జరపాలంటూ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, ఫ్యాక్టరీస్ డిపార్ట్ మెంట్‌ల ద్వారా ఆర్ఎఫ్సీఎల్‌కు నోటిసులు కూడా జారీ చేశారు. యూరియా ప్లాంట్‌లో ప్లేర్ స్టేక్ నిర్మించకుండానే ఫ్యాక్టరీని నిర్మించారని అధికారులు గుర్తించారు. లీకేజీలు సంభవించినప్పుడు అమ్మోనియాను ఫ్లేర్ స్టేక్ ద్వారా బయటకు పంపి ఫైర్ చేయాల్సి ఉంటుంది కానీ, ఎరువుల ఫ్యాక్టరీలో ఈ నిర్మాణమే జరగలేదని అధికారలు నిర్దారించారు.

ఫ్లేర్ స్టేక్ నిర్మించకపోవడం వల్లే ఇలాంటి ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడ్డట్లు గుర్తించారు. మే 17 అర్ధరాత్రి యూరియా ఉత్పత్తిలో కెమికల్ బ్యాలెన్స్ తప్పడం వల్లే అమ్మోనియా, కార్బన్ డై యాక్సైడ్ విడుదలైటన్లు అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఆ సమయంలో పని చేయాల్సిన ఇన్ లెట్ వాల్వ్‌లు మూత పడకపోవడం వల్లే లీకేజ్ స్క్వాడ్ సిస్టం పని చేయలేదని అధికారులు గుర్తించారు. అమ్మోనియా కార్బైట్ విష వాయువు వల్ల యంత్రాలు చెడి పోతాయని భావించి యాజమాన్యం నేరుగా విషవాయువులు గాలి లోకి వదిలినట్టుగా ఆయా శాఖాలు తేటతెల్లం చేశాయి. దీంతో రెండు రోజుల పాటు విషవాయువులతో రామగుండం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

RFCL డిజైన్ ప్రకారం నిర్మాణం చేయలేదని ఫ్యాక్టరీ విభాగం నిర్దారణకు రావడం గమనార్హం. ఫ్లేర్ స్టేక్ నిర్మించకపోవడం, నాక్ ఔట్ డ్రమ్ కెపాసిటీ సరిపోకపోవడం, రికవరీ సిస్టమ్ మోడిఫై కాకపోవడం, ఆటోమెటిక్ సిస్టమ్‌గా చెప్తున్న డీసీఎస్ సిస్టం పని చేయలేదని అధికారులు గుర్తించారు. వాటిని సరిచేయకుండానే ఈ నెల 5న ట్రయల్ రన్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తుండటం గమనార్హం. RFCL అధికారులు కర్మాగారం ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలు కూడా చేపట్టలేదని అధికారులు గుర్తించారు. అయితే, కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ ఎరువుల కర్మాగారం విభాగం అధికారులు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని డిపార్ట్ మెంట్లు ఇచ్చిన ఆదేశాలను అమలు చేస్తారా లేదా అన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.



Next Story

Most Viewed