కబ్జా వ్యవహారంలో రెవెన్యూ అధికారులు.. వీఆర్ఏలకు నోటీసులు

by  |
కబ్జా వ్యవహారంలో రెవెన్యూ అధికారులు.. వీఆర్ఏలకు నోటీసులు
X

దిశ, ఆర్మూర్: ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు.. భూకబ్జాల వ్యవహారంలో కిందిస్థాయి సిబ్బంది మెడకు ఉచ్చు బిగిసింది. మాక్లూర్ మండలం రాంచంద్రపల్లి గ్రామంలో కబ్జాకు గురైన భూములను శనివారం పరిశీలించిన రెవెన్యూ అధికారులు అదేరోజు కబ్జాదారులకు నోటీసులు ఇచ్చారు. అంతటితో ఆగకుండా స్థానిక వీఆర్ఏలనూ బలి పశువులను చేశారు. సోమవారం స్థానిక వీఆర్ఏలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అధికారుల తీరు స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. తహసీల్దార్ కార్యాలయంలోని ఓ అధికారి పట్టుబట్టి మరీ వీఆర్ఏలకు నోటీసులు ఇప్పించడం గమనార్హం. స్వాతంత్ర్య వేడుకల్లో చాలామంది ఉత్తమ అధికారులుగా, ఉత్తమ ఉద్యోగులుగా అవార్డులు తీసుకున్నారు. 2021 పంద్రాగస్టు ఉత్సవాల మరుసటి రోజు అధికారులు తమకు షోకాజ్ నోటీసులు బహుమానంగా ఇచ్చారన్న చేదు జ్ఞాపకం వీఆర్ఏలకు గుర్తుండిపోతుందనడంలో అతిశయోక్తి లేదు!

దిద్దుబాటు చర్యల్లో వీఆర్ఏలే బలి పశువులు…

రాంచంద్రపల్లిలో భూముల కబ్జా వ్యవహారంలో పలుమార్లు జిల్లా మెజిస్ట్రేట్ అయిన కలెక్టర్‌కు ఫిర్యాదులు వెళ్లాయి. అప్పుడు తీవ్రంగా స్పందించని అధికారులు ఇప్పుడు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. గతంలో మొక్కుబడి చర్యలతో సరిపెట్టుకొని ఇప్పుడు తప్పంతా కిందిస్థాయి సిబ్బందే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. కబ్జాల వ్యవహారం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లినప్పుడల్లా మేం పని చేస్తున్నామని చెప్పుకోడానికి అన్నట్లు కబ్జాదారులకు నోటీసులు ఇచ్చి ఊరుకునేవారు. గతంలో ఇచ్చిన నోటీసులకు ఆరోపణలు ఎదుర్కొంటున్నవారి నుంచి ఎలాంటి బదులు రాకున్నా ఆ ఊసే ఎత్తని అధికారులు ఇప్పుడు కిందిస్థాయి సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు చేపట్టడం విమర్శలకు తావిస్తోంది. మొదటిసారి ఫిర్యాదు వచ్చినప్పుడే కబ్జాదారుల పట్ల కఠినంగా వ్యవహరించి ఉంటే భూకబ్జాల విషయంలో రాంచంద్రపల్లి రచ్చకెక్కేది కాదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.

ఆ స్థలంలో పార్కు ఏర్పాటు చేస్తాం: తహసీల్దార్

రాంచంద్రపల్లిలో కబ్జాకు గురైన భూములను ఆక్రమణదారుల చెర నుంచి విడిపిస్తామని తహసీల్దార్ సీహెచ్.ఆంజనేయులు ‘దిశ’తో చెప్పారు. సింగ చిన సముద్రం చెరువు శిఖం భూములు కబ్జాకు గురికాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. భూకబ్జాల విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి అక్కడ ఉద్యానవనం ఏర్పాటు చేయిస్తామని తెలిపారు.



Next Story

Most Viewed