ఆహా.. రామరాజ్యం.. ముడుపులు ఇస్తే గుట్టనే పట్టా చేసిన రెవెన్యూ అధికారులు

by  |
land scam cartoon
X

దిశ, అచ్చంపేట : రెవెన్యూ శాఖ అనగానే అందరికీ గుర్తొచ్చేది కాసులిస్తే దేనినైనా తారుమారు చేసి ప్రభుత్వ నిబంధనలకు తూట్లు పొడుస్తూ చట్టం వారి చుట్టం గా పనిచేస్తుందని అపోహలతో లంచాలకు కక్కుర్తిపడి గుట్టుచప్పుడు కాకుండా ప్రభుత్వ భూములను ఇతరులకు అప్పనంగా అప్పజెప్పే తతంగం పూర్తవుతుంది. ఏకంగా నలభై ఐదు ఎకరాలు ఉన్న ప్రభుత్వ గుట్టను ఒకే కుటుంబానికి పట్టా చేసిన నాగర్ కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కొంతమంది రైతులు రెవెన్యూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో విషయం బయటకు పొక్కింది. గ్రామస్తుల సమాచారం మేరకు జిల్లాలోని లింగాల మండల కేంద్రానికి శివారులోని నెమలి గుట్ట సర్వే నెంబర్ 576లో 45 ఎకరాల ప్రభుత్వ భూమిలో 33 ఎకరాల ప్రభుత్వ భూమిని ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు వ్యక్తులు అక్రమంగా పట్టా చేసుకున్నారు.

అక్రమంగా పట్టా చేసుకున్న వారు..

పై సర్వే నెంబర్లు లింగాల మండల కేంద్రానికి చెందిన ఒకే కుటుంబంలో ఏడుగురు వ్యక్తులకు రెవెన్యూ అధికారులు కాసులకు కక్కుర్తిపడి చేసిన దుస్థితి. ఇద్దరూ చనిపోయి ఉండగా 3వ తరగతి చదువుతున్న 8 సంవత్సరాల బాలుడి పేరున కూడా ధరణిలో భూమి ఉన్నట్లు నమోదు చేసిన దైనందిన దుస్థితి లింగాల మండల రెవెన్యూ అధికారుల పనితీరుకు నిదర్శనం అని చెప్పవచ్చు. ప్రభుత్వ భూమిపైన నెమలి గుట్టను అప్పనంగా పట్టా చేసుకున్న వారి పేర్లు ఇలా ఉన్నాయి

1. మూడవత్ బీక్యా పేరున సర్వేనెంబర్ 576/1 లో 5 ఎకరాలు
2. మూడవత్ లక్ష్మి పేరున సర్వేనెంబర్ 576/1 సీ లో 5 ఎకరాలు
3. మూడవత్ జగాన పేరున సర్వేనెంబర్ 576/1 బీ లో 5 ఎకరాలు,
4. మూడవత్ పర్వతాలు పేరున సర్వేనెంబర్ 576/2/1 లో 5 ఎకరాలు
5. మూడవత్ నీలావతి పేరున సర్వేనెంబర్ 576/2/ఎ లో 5 ఎకరాలు
6. మూడవత్ శంకర్ పేరున సర్వేనెంబర్ 576/1/ఎ లో 5 ఎకరాలు
7. మూడవత్ అర్జున్ చౌహాన్ పేరున సర్వేనెంబర్ 576/2/బీ లో 3 ఎకరాలు పట్టా చేసి ధరణి లో నమోదు చేశారు.

కాసులిస్తే చాలు ఆ శాఖ దేనికైనా రెడీ…

ముఖ్యమంత్రి కేసీఆర్ రెవెన్యూ శాఖ పై అసంతృప్తిగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట రెవెన్యూ శాఖ అవినీతి బయట పడుతూనే ఉన్నది. కానీ రెవెన్యూ అధికారుల్లో మార్పులు చోటు చేసుకోవడం లేదని ఆరోపణలు బాహటంగానే వినిపిస్తున్నాయి. రెవెన్యూ అధికారులకు వారు డిమాండ్ చేసిన మేరకు ముడుపులు చెల్లిస్తే దేనినైనా అక్రమంగా ఆసుపత్రుల సృష్టించే అక్రమార్కులకు అప్పనంగా కట్ట పెడుతున్న తీరు కనబడుతూనే ఉన్నది.

అదే తరహాలో లింగాల మండల కేంద్రంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు వ్యక్తులకు ప్రభుత్వ భూమిని ఇద్దరు చనిపోయిన వ్యక్తుల పేరున పది ఎకరాలు, 8 ఏళ్ల వయసు ఉన్న బాలుడి పైన మూడు ఎకరాలు, ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగుల పేరున 10 ఎకరాల చొప్పున పట్టా చేసిన తీరు చూస్తుంటే అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎవరికైనా భూ బదలాయింపు గానీ లేక విరాసత్ కానీ నిజాయితీగా హక్కు దారులకు భూమిని పట్టా చేయాలంటే … రెవెన్యూ అధికారులు నెలల తరబడి కాలయాపన చేస్తూ బాధితులను ముప్పుతిప్పలు పెడుతున్న సందర్భాలు కోకొల్లలు గా ఉన్నాయి.

వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలి

ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు వ్యక్తులు అక్రమంగా ప్రభుత్వ భూమి పట్టా చేసుకున్న వారి పైన అదే గ్రామానికి చెందిన రైతులు బాలు, నిరంజన్, శంకర్, రాంజీ, పెంటయ్య, దేవుడు, రవీందర్, హనుమంతు, అబ్దుల్ రసూల్, దేవేందర్, హేమలత, రాజేందర్, శంకర్ లాల్, మోతి రామ్ తదితరులు తర్వాత రాతపూర్వకంగా రెవిన్యూ ఉన్నత అధికారులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

దళారులకు అమ్ముడుపోయిన అధికారులు…

దాదాపు 33 ఎకరాల గుట్టను ఆక్రమించి గుట్టలోని పెద్దపెద్ద వృక్షాలు, చెట్లు, బండరాళ్లను జెసిబి లాంటి యంత్రాల ద్వారా రాత్రికి రాత్రి తవ్వకాలు జరిపి, విలువైన వృక్ష సంపద నాశనం చేశారని వారిపై అటవీశాఖ, వాల్టాచట్టం, పంచాయతీరాజ్ చట్టం ద్వారా చర్యలు తీసుకోవాలని డిమాండ్ గ్రామ రైతులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం హరితహారం ద్వారా అడవులను, చెట్లను రక్షించడం, నాటడం చేస్తున్న క్రమంలో కొందరు దళారులు, రెవెన్యూ అధికారుల అండదండలతో చివరికి వందల ఏళ్లనాటి గుట్టలనే ధ్వంసం చేసి ఆక్రమణలు చేస్తున్నారని అలాంటి వారిపై ప్రభుత్వ పరంగా క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు.

గతంలో లింగాలలో పనిచేసిన రెవెన్యూ అధికారులు మల్లికార్జునరావు, లక్ష్మీదేవి, శరబంధుతో పాటు ప్రస్తుతం పనిచేస్తున్న వీఆర్ఓలు తిరుపతయ్య, చందర్, సర్వే రాంబాబు, అచ్చంపేట మండలం ఐనోలు వీఆర్ఏ హనుమంతు ఇతర అధికారులు డబ్బులకు ఆశపడి ప్రభుత్వ భూమిని అక్రమంగా దొంగచాటున పట్టా చేశారని ఆరోపిస్తూ ఇలాంటి అధికారుల పైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని రెవిన్యూ ఉన్నతాధికారులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేసి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే సమీప రైతులు తమ పొలాలకు వెళ్లే బాటను సైతం ఆక్రమించారని ఆరోపణలు ఉన్నాయి.

విచారణ చేస్తున్నాం…

పై విషయం పై లింగాల మండల తహసీల్దార్ మునీరుద్దీన్ ను ‘దిశ’ ప్రతినిధి ఫోన్ ద్వారా వివరణ కోరగా సర్వే నెంబర్ 576 నెమలి గుట్ట ప్రభుత్వ భూమి నలభై ఐదు ఎకరాలు ఉందని, అందులో ముప్పై మూడు ఎకరాలు గతంలో పని చేసిన రెవెన్యూ అధికారులు అక్రమంగా పట్టా చేశారని గ్రామస్థుల నుండి ఫిర్యాదులు అందాయని దాని పై సమగ్ర విచారణ చేపడుతున్నామని, విచారణ అనంతరం ఉన్నతాధికారులకు నివేదిక అందజేసి తగు చర్యలు తీసుకుంటామని, విచారణలో ఉన్నందున పూర్తి విషయాలు తెలపడం భావ్యం కాదని విచారణ అనంతరం తెలియజేస్తామని తహసీల్దార్ వివరించారు.



Next Story