ఆర్టీసీ కార్గో సేవలతో రూ.34కోట్లు ఆదాయం

by  |
RTC cargo services
X

దిశ, తెలంగాణ బ్యూరో : తక్కువ సమయంలోనే టీఎస్ ఆర్టీసీ కార్గో, పార్శిల్ సేవలు వినియోగదారుల ఆదరణ చూరగొనడం అందరి సమిష్టి కృషితోనే సాధ్యమైందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. శుక్రవారం కార్గో, పార్శిల్ సేవలు ప్రారంభించి ఏడాది పూర్తైన సందర్భంగా సిబ్బందిని, అధికారులను అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ మానస పుత్రికగా కార్గో, పార్శిల్ సేవలు దినదినాభివృద్ధి చెందుతుందని, తక్కువ సమయంలోనే ప్రజలకు చేరువైందన్నారు.

ఇప్పటి వరకు 32 లక్షల పార్శిల్స్ సర్వీసు ద్వారా రూ.34 కోట్లు, కార్గో బస్సులతో రూ.12 కోట్లు మొత్తం రూ.46 కోట్లు ఆర్జించడం హర్షనీయమన్నారు. మొత్తం 177 బస్ స్టేషన్లలో కౌంటర్లు, 810 మంది ఏజెంట్లతో కార్గో, పార్శిల్ సేవలు కొనసాగుతున్నాయని, వీటిని మరింత విస్తరించనున్నట్లు మంత్రి వెల్లడించారు. సంస్థకు కండక్టర్లు, డ్రైవర్లే నిజమైన రథసారథులని కితాబిచ్చారు. కార్గో, పార్శిల్ సేవల్ని వినియోగిస్తున్న వినియోగదారులకు కృతజ్ఞతలు తెలిపారు. సంస్థ ఎండీ సుశీల్ శర్మ, ప్రత్యేకాధికారి కృష్ణకాంత్ పర్యవేక్షణను ప్రశంసించారు. వినియోగదారులు పార్శిల్, కార్గో సేవల్ని మరింత ఆదరించి సంస్థ ఆర్థికాభివృద్ధికి తోడ్పాటునందించాలని కోరారు.



Next Story

Most Viewed