కాంగ్రెస్ నేతల్లో నయా జోష్.. ఒక్కటైన రేవంత్ రెడ్డి, ఏలేటి

by  |
కాంగ్రెస్ నేతల్లో నయా జోష్.. ఒక్కటైన రేవంత్ రెడ్డి, ఏలేటి
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: ఆ ఇద్దరు కీలక నేతలు ఎట్టకేలకు ఒక్కటయ్యారు. అలక బూనిన ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డిని బుజ్జగించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించాయి. సీనియర్ నాయకులు కుందూరు జానారెడ్డి, మహమ్మద్ అలీ షబ్బీర్ మధ్యవర్తిత్వంతో వివాదం సమసిపోయింది. ఏకంగా ఆదివారం రోజున హైదరాబాదులోని ఏలేటి ఇంటికి టీపీసీసీ అధ్యక్షుడు ఎనుముల రేవంత్ రెడ్డి వెళ్లటంతో అంతా సద్దుమణిగింది.

ఇంద్రవెల్లి దళిత దండోరా.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెసులో పాత పగలకు కొత్త సెగలు పుట్టించిన విషయం తెలిసిందే. తూర్పు ప్రాంతానికి చెందిన మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేం సాగర్ రావుకు ఇంద్రవెల్లి సభ నాయకత్వ బాధ్యతలు అప్పగించటంతో.. మాజీ ఎమ్మెల్యే ఏలేటి అలక, అసంతృప్తికి కారణమైంది. దళిత దండోరా సభ నిర్వహణ, నాయకత్వం విషయంలో ఎనుములకు, ఏలేటికి మధ్య విబేధాలు వచ్చాయి. స్థానిక డీసీసీకే సభ నిర్వహణ బాధ్యత అప్పగించటంతో కాస్తా మెత్త బడిన ఏలేటి.. ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాకు రాలేదు. సోమవారం రోజున ఇంద్రవెల్లిలో దళిత దండోరా నిర్వహిస్తుండగా.. ఆయన ఇటు ఇంద్రవెల్లికి, అటు నిర్మల్ రాలేదు. దీంతో నిర్మల్ నియోజకవర్గంతో పాటు ఉమ్మడి జిల్లాలోని ఆయన వర్గం నాయకులు, క్యాడర్ గందరగోళంలో పడింది.

ఇక దళిత దండోరా విజయవంతం చేసేందుకు నియోజకవర్గాల వారీగా ఇన్‌చార్జీలను వేయగా.. వారే క్షేత్రస్థాయిలో వెళ్లి ప్రజలను కలిసి సమీకరణ ప్రయాత్నాల్లో ఉన్నారు. మరోవైపు ఇంద్రవెల్లి దళిత దండోరా ఏర్పాట్లను రేవంత్ రెడ్డి సన్నిహితులుగా ఉన్న ములుగు ఎమ్మెల్యే సీతక్క, విజయరమణారావు, వేంనరేంద్ర రెడ్డి, పటేల్ రమేష్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. ఏలేటి అంటీ అంటనట్టుగా వ్యవహరించటం, ఇప్పటి వరకు జిల్లాకు రాకపోవటంతో.. ఈ ప్రభావం దండోరా మీద పడుతుందని గ్రహించిన రేవంత్ స్వయంగా తానే రంగంలోకి దిగారు. ఆదివారం రోజున హైదరాబాదులోని ఏలేటి ఇంటికి వెళ్లి.. స్వయంగా చర్చించారు. జరిగినదంతా మరిచిపోయి.. కలిసి పని చేద్దామనటంతో ఇద్దరి మధ్య నెలకొన్న విబేధాలు తొలగిపోయాయి. అక్కడే మధ్యాహ్నం భోజనం చేసి.. మీడియాతో మాట్లాడారు. సోమవారం రోజున ఇంద్రవెల్లి దళిత దండోరాకు ఇద్దరు నేతలు కలిసి రానున్నారు.

ఇంద్రవెల్లి దళిత దండోరా ఏర్పాట్లు, జన సమీకరణకు సంబంధించి ఇప్పటి వరకు కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎవరూ రాలేదు. . టీపీసీసీకి సంబంధించి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్, మల్లురవి, బలరాం నాయక్ వచ్చి ఏర్పాట్లు పరిశీలించగా…. నియోజకవర్గాల ఇన్‌చార్జీలు తమ సెగ్మెంట్లలో పర్యటించారు. ఇక కాంగ్రెస్ సీనియర్లు, కీలక నేతలు ఇంద్రవెల్లి సభకు వస్తారా.. లేదోననే చర్చ మొదలైంది. ఈ సభకు ఎందరు వస్తారు.. ఎందరు దూరంగా ఉంటారనే అనుమానాలు మొదలయ్యాయి. మరోవైపు మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల వర్గం, మాజీ ఎమ్మెల్యే ఏలేటి వర్గాలు కలువకపోగా.. అన్ని చోట్ల నాయకులు రెండు గ్రూపులుగా విడిపోయారు. ఖానాపూర్ నియోజకవర్గ ఇన్‌చార్జీ విషయంలోనూ వివాదం మొదలైంది. భరత్ చౌహాన్, చారులతా రాథోడ్ మధ్య విబేధాలుండగా.. బహిరంగంగానే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఏదైమైనా రేపు ఇంద్రవెల్లిలో జరగబోయే దళిత దండోరా కార్యక్రమం రాజకీయ వర్గాల్లో సెగ పుట్టిస్తోంది.

Next Story

Most Viewed