ఉద్యోగులకు మళ్ళీ ఆంక్షలు

by  |
ఉద్యోగులకు మళ్ళీ ఆంక్షలు
X

దిశ, న్యూస్‌బ్యూరో: ఒకవైపు అన్‌లాక్ అంటూ కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను రూపొందించి అమలుచేయిస్తూ ఉంటే తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు ఆంక్షలను అమలుచేస్తూ ఉంది. ఇకపైన 50% మంది ఉద్యోగులు మాత్రమే రోజు విడిచి రోజు విధులకు హాజరుకావాలని ప్రధాన కార్యదర్శి సర్క్యులర్ జారీ చేశారు. ప్రత్యేకంగా ఛాంబర్‌లు ఉన్న అధికారులు మాత్రమే ప్రతీరోజు విధులకు హాజరుకావాలని, మిగిలిన సబార్డినేట్ స్టాఫ్ మొత్తం వారానికి మూడు రోజులు మాత్రమే హాజరైతే సరిపోతుందని పేర్కొన్నారు. అయితే ఇంటి దగ్గర ఉంటే మూడు రోజులు తప్పనిసరిగా హైదరాబాద్‌లోనే ఉండాలని, ఇతర ఊర్లకు వెళ్ళొద్దని, అత్యవసర పనిబడితే ఆఫీసుకు హాజరయ్యేందుకు సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు.

జూన్ 22నుంచి జూలై 4వ తేదీ వరకు ఈ ఆంక్షలు వర్తిస్తాయని పేర్కొన్నారు. సచివాలయంలో ఆర్థికం, మైనారిటీ సంక్షేమం, వైద్యారోగ్యం తదితర పలు డిపార్టుమెంట్లలో ఉద్యోగులకు వైరస్ సోకడం, వారి ద్వారా ఇతరులకు వ్యాపించి పాజిటివ్ బారిన పడిన నేపథ్యంలో ప్రధాన కార్యదర్శి ఈ నిర్ణయం తీసుకున్నారు. డ్రైవర్లు వారి వాహనాల దగ్గర గుంపులుగా చేరి ముచ్చట్లు పెట్టుకోవద్దని, సంబంధిత అధికారుల పేషీల్లో కూర్చోవాలని స్పష్టం చేశారు. విధులకు హాజరయ్యే సిబ్బంది సైతం మధ్యాహ్న భోజనాన్ని ఇంటి నుంచే తెచ్చుకోవాలని, ఉద్యోగులంతా ఒకేచోట కూర్చుని తినడానికి బదులుగా వేర్వేరుగా తినడమో లేక దూరంగా కూర్చోవడమో చేయాలని సూచించారు. ఆఫీసులో పనిచేసేటప్పుడు మాస్కు కట్టుకోవడం, సామాజిక దూరాన్ని పాటించడం, శానిటైజర్లను వాడడం లాంటివి పాటించాలన్నారు.

Next Story

Most Viewed