మతసహనమే భారత్ బలం

by  |
మతసహనమే భారత్ బలం
X

దిశ, వెబ్‌డెస్క్ : ‘భారతదేశ జనాభాలో 80 శాతం మంది హిందువులు కాగా, 14 శాతం మంది ముస్లింలు ఉన్నారు. 97 శాతం మంది భారతీయులు తాము దేవుడిని నమ్ముతున్నట్లు చెప్పారు. అన్ని మతాలవారు పరమత సహనం కలిగి ఉన్నారని ఈ నివేదిక తెలియజేసింది. నిజమైన భారతీయుడు ఇతర మతాలను గౌరవిస్తాడని 84శాతం మంది తెలిపారని సర్వే పేర్కొంది. ఇతర మతాలను గౌరవిస్తేనే తమ మతాన్ని సరైన రీతిలో అనుసరిస్తున్నట్టని 80 శాతం మంది తెలిపారు. భిన్న మతాలకు చెందిన ప్రజలు దేశంలో ఉండడం లాభిస్తుందని 53 శాతం మంది చెప్పారు. పరమత సహనం కలిగి ఉన్నామని చాలా మంది చెబుతున్నా, మతాంతర వివాహాలను వ్యతిరేకించేవారు మాత్రం అధిక సంఖ్యలో ఉన్నారు.’

నిరుద్యోగం, ఆర్థిక వృద్ధి మందగింపు, వాతావరణ మార్పులు, పర్యావరణ సంక్షోభంలాంటి పెద్దపెద్ద సమస్యలను పక్కనబెట్టి, దేశంలోని ప్రధాన స్రవంతి మీడియా ఇప్పుడు మత మార్పిడులను భయంకర సమస్యగా చూపిస్తోంది. నిజాలను దాచిపెడుతూ ప్రజలను వర్గీకరించేలా పనిచేస్తోంది. తద్వారా అధికారాన్ని శాశ్వతం చేసుకోవాలనుకునే ఒక పార్టీకి పావుగా మారుతోంది. మత మార్పిడుల వెనక పెద్ద ఎత్తున కుట్ర జరుగుతోందని కొన్ని మీడియా సంస్థల విష ప్రచారాన్ని ‘ప్యూ రీసెర్చ్ సెంటర్’ నివేదిక కొట్టి పారేసింది. పెద్ద ఎత్తున సర్వే నిర్వహించి వాస్తవాలను వెలికితీయే ప్రయత్నం చేసింది. సర్వే గణాంకాలను పరిశీలిస్తే వాస్తవం ఇట్టే అర్థమవుతుంది. అమెరికాకు చెందిన ‘ప్యూ రీసెర్చ్ సెంటర్’ సంస్థకు సర్వేలలో మంచి పేరుంది. పక్షపాతం వహించకుండా సర్వే నిర్వహించే సంస్థగా గుర్తింపు ఉంది. అలాంటి సంస్థ భారతదేశంలో 2019-2020 మధ్యలో పెద్ద ఎత్తున సర్వే నిర్వహించింది. 30వేల మందిని నేరుగా కలిసి ‘మతం, కులం, జాతీయత’పై వారి అభిప్రాయాలు తెలుసుకుంది. 26 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాలలో తిరిగి 17 భాషలలో ఇంటర్వ్యూలు తీసుకుంది. సర్వే నివేదికను ఇటీవల విడుదల చేసింది. ఈ నివేదిక గణాంకాలను చూస్తే మత మార్పిడులపై కుట్ర, దుష్ప్రచారం అనేది కేవలం ‘రాజకీయ–మీడియా’ సృష్టే అని తేట తెల్లమవుతోంది.

ఇదీ పరిస్థితి

భారతదేశ జనాభాలో 80 శాతం మంది హిందువులు కాగా, 14 శాతం మంది ముస్లింలు ఉన్నారు. 97 శాతం మంది భారతీయులు తాము దేవుడిని నమ్ముతున్నట్లు చెప్పారు. అన్ని మతాలవారు పరమత సహనం కలిగి ఉన్నారని ఈ నివేదిక తెలియజేసింది. నిజమైన భారతీయుడు ఇతర మతాలను గౌరవిస్తాడని 84శాతం మంది తెలిపారని సర్వే పేర్కొంది. ఇతర మతాలను గౌరవిస్తేనే తమ మతాన్ని సరైన రీతిలో అనుసరిస్తున్నట్టని 80 శాతం మంది తెలిపారు. భిన్న మతాలకు చెందిన ప్రజలు దేశంలో ఉండడం లాభిస్తుందని 53 శాతం మంది చెప్పారు. పరమత సహనం కలిగి ఉన్నామని చాలా మంది చెబుతున్నా, మతాంతర వివాహాలను వ్యతిరేకించేవారు మాత్రం అధిక సంఖ్యలో ఉన్నారు.

పరమత సహనం ఎక్కువ

దేశంలో పరమత సహనం ఎక్కువ ఉందని అనేక ఘటనలు రుజువు చేశాయి. కొవిడ్ మహమ్మారి సమయంలో హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు ఒకరినొకరు ఎంతగానో సహకరించుకున్నారు. దీనికి ప్రధాన స్రవంతి మీడియా అంతగా ప్రాధాన్యతనివ్వలేదు. ఢిల్లీలో అల్లర్లు జరిగినప్పుడు ఓ ముస్లిం కుటుంబాన్ని పొరుగునే ఉన్న హిందువులు కాపాడారు. ముస్తఫాబాద్‌లో ఓ హిందూ కుటుంబాన్ని పొరుగునే ఉన్న ముస్లిం కుటుంబం రక్షించింది. ఎక్కువ మంది ప్రజలు ఒకరినొకరు గౌరవించుకోవడానికే ప్రాధాన్యతనిస్తున్నారు. మతం పేరుతో అప్పుడప్పుడు జరుగుతున్న అల్లర్లు, దుష్ర్పచారాల వెనక రాజకీయ కారణాలు ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. దుష్ప్రచారం చేసేవారి సంఖ్య తక్కువగా ఉన్నా, అలాంటి వారినే మీడియా హైలైట్ చేస్తుండడంతోనే సమస్య ఏర్పడుతోంది. మన రాజకీయ నాయకులు కూడా వారికే వత్తాసు పలుకుతుండడంతో వారి గురించి ఎక్కువ ప్రచారం జరుగుతోంది. దీని ద్వారా ప్రజలలో మతం పట్ల ఓ తెలియని భయం నెలకొంటోంది.

వారే అధికం

‘ప్యూ రీసెర్చ్ సెంటర్’ అడిగిన ఒక ప్రధాన ప్రశ్న ఏమీటంటే, మీరు చిన్నప్పుడు ఏ మతంలో పెరిగారు? ప్రస్తుతం ఏ మతంలో ఉన్నారు? అని. 98 శాతం మంది ప్రజలు చిన్నప్పటి మతం, ప్రస్తుత మతం ఒకటే అని చెప్పారు. రెండు శాతం మంది మతాన్ని మార్చుకున్నట్టు భావించినా, 130 కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో అది చిన్న సంఖ్యేమీ కాదు. ఒక మతం నుంచి బయటకు వెళ్తున్నవారు, ఇతర మతాల నుంచి వస్తున్నవారు చాలా మతాలలో ఒకే మాదిరిగా ఉన్నారు. సర్వే ప్రకారం ఇతర మతాలకు వెళ్తున్న హిందువుల సంఖ్య కంటే, ఇతర మతాల నుంచి హిందువులుగా మారుతున్నవారే అధికం. చిన్నతనంలో హిందువులుగా ఉండి మతం మారినవారు 0.7 శాతం కాగా, ఇతర మతాల నుంచి హిందువులుగా మారిన సంఖ్య 0.8 శాతముంది. ముస్లింలలో వచ్చీపోయే వారి సంఖ్య 0.3 శాతం సమానంగా ఉంది. సిక్కులు, బౌద్ధులలో ఇది 0.1 శాతంగా ఉంది. చిన్నతనంలో ఏ మతాన్నీ అనుసరించని 0.1 శాతం మంది పెద్దయ్యాక ఏదో ఒక మతాన్ని అనుసరిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. ఇతర మతాల నుంచి క్రైస్తవులుగా మారుతున్నవారి సంఖ్య 0.4 శాతం ఉండగా, క్రైస్తవం నుంచి ఇతర మతాలకు మారుతున్న వారి సంఖ్య 0.1 శాతంగా ఉంది. ఈ గణాంకాలను చూస్తే మతాంతీకరణతో ఏదో పెద్ద ప్రమాదం ముంచుకొస్తుందని భావించాల్సిన పరిస్థితి మాత్రం కనిపించడం లేదు.

‘కుట్ర కోణం’ ఓ పెద్ద కుట్ర..

మతాన్ని మార్పించడానికి రహస్యంగా ఏదో పెద్ద కుట్ర జరుగుతోందని, ‘లవ్ జిహాద్’ పేరుతో ఒక మతంవారు ఇతర మతాల వారిని తమ మతంలోని మార్పించుకుంటున్నారని మీడియా పెడుతున్న గగ్గోలు అంతా బూటకమే అని ఈ రిపోర్ట్ ద్వారా తేటతెల్లం అవుతోంది. మీడియా ప్రచారం ప్రజలలో భయాన్ని నెలకొల్పడానికే అని స్పష్టమవుతోంది. ఒక రాజకీయ పార్టీకి లబ్ది చేకూర్చడానికే వారి ప్రయత్నమని తెలుస్తోంది. బలవంతపు మత మార్పిడులు కొన్ని ఉన్నా, అవి వ్యక్తిగతం మాత్రమే. వేలు, లక్షలలో మత మార్పిడులు చేసేందుకు కుట్ర జరుగుతున్నట్టు ఎక్కడా నిరూపితం కాలేదు. అలాంటిదేమైనా జరిగి ఉంటే ఇప్పటికే ఆ విషయం స్పష్టంగా కనిపించేది. గతేడాది కాన్పూర్‌లో 14 కేసులకు సంబంధించి ఒక ప్రత్యేక బృందం పరిశోధన చేసింది. దీని వెనక పెద్ద కుట్ర దాగి ఉందనే కనీస రుజువులు వారికి లభించలేదు. బలవంతపు మార్పిడులు రాజ్యాంగ విరుద్ధం. దీనిని నిరోధించేందుకు, నిందితులను శిక్షించేందుకు అనేక చట్టాలు ఉన్నాయి. ఒకటి, రెండు ఘటనలను దృష్టిలో ఉంచుకొని కోట్లాది మంది స్వేచ్ఛను హరించలేం. ఇక్కడ ప్రజలు చేయాల్సింది ఒక్కటే. మతం పేరుతో రాజకీయాలు చేసే వారిని గుర్తించి, అలాంటి వారిని, అలాంటి పార్టీలను దూరం పెట్టడమే.

ఫిరోజ్ ఖాన్
96404 66464


Next Story

Most Viewed