రెయిన్ బజార్‌లో పడిన ఓట్ల శాతం సున్నాకు బరాబర్

by  |
రెయిన్ బజార్‌లో పడిన ఓట్ల శాతం సున్నాకు బరాబర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: జీహెచ్ఎంసీ ఎన్నికల అంశం నిన్నటి వరకు ఒకలా ఉంటే… పోలింగ్ వేళ చర్చ మరోలా ఉంది. ఎన్నడూలేని విధంగా ప్రముఖ పార్టీలు జిహెచ్ఎంసీ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని, ప్రచారం హోరెత్తించాయి. యజ్ఞాలు, యాగాలు కూడా చేశాయి. ఎంత ఏం చేసి ఏం లాభం? పోలింగ్ వేళ నేతలకు ఊహించని షాక్ తగులుతోంది. తమ పార్టీకి ఊహించిన స్థాయిలో ఓట్లు పడే మాట సైడుకి పెడితే… కొన్ని డివిజన్లలో బరాబర్ సున్నా శాతం ఓట్లు పోల్ అవడం గమనార్హం.

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మధ్యాహ్నం ఒంటిగంట సమయానికి అత్యధికంగా గుడిమల్కాపూర్ డివిజన్‌లో దాదాపు యాభై శాతం (49.19%) పోలింగ్ నమోదు కాగా… రెయిన్ బజార్‌ డివిజన్‌లో మాత్రం ఒక్క శాతం కూడా దాటలేదు. ఈ డివిజన్‌లో మొత్తం 55 పోలింగ్ కేంద్రాల్లో 42,718 మంది ఓటర్లు ఉంటే మధ్యాహ్నం ఒంటిగంట సమయానికి కేవలం 240 మంది మాత్రమే ఓటువేశారు. మొత్తం ఓటర్లలో ఇది కేవలం 0.56% మాత్రమే. సమీపంలోనే ఉన్న తలాబ్ చంచలం డివిజన్‌లో మొత్తం 44,969 మంది ఓటర్లు ఉంటే కేవలం 332 మాత్రమే (0.74%) ఓటు వేశారు. ఇక అమీర్‌పేట్‌లో 48,268 మంది ఓటర్లు ఉంటే కేవలం 379 మంది (0.79%) మాత్రమే ఓటు వేశారు.

జూబ్లీహిల్స్ సర్కిల్‌లోని షేక్‌పేటలో మొత్తం 80 పోలింగ్ కేంద్రాల పరిధిలో 63,230 మంది ఓటర్లు ఉన్నా కేవలం 1,658 మంది (2.62%) మాత్రమే ఓటు వేశారు. ఇక జియాగూడ, కార్వాన్ డివిజన్లలో కేవలం 3.85% మంది ఓటర్లు మాత్రమే పోలింగ్‌కు హాజరయ్యారు. చంద్రాయణ్‌గుట్ట సర్కిల్‌లోని కంచన్‌బాగ్‌లో 2.13%, శాలిబండలో 3.85%, దబీర్‌పురలో 5.39%, అత్తాపూర్‌లో 3.85% చొప్పున మాత్రమే పోలింగ్ నమోదైంది. వ్యాపారస్తులు ఎక్కువగా ఉండే బేగం బజార్‌లో సైతం 3.85%, సోమాజీగూడలో 2.77%, కుత్బుల్లాపూర్ సర్కిల్‌లోని సుభాష్‌నగర్‌లో 3.85% చొప్పున పోలింగ్ నమోదైంది.

ఇక శివారు ప్రాంతాలైన రామచంద్రాపురం, పటాన్‌చెరు, భారతీనగర్, చిలకానగర్, హస్తినాపురం, మూసాపేట్ సర్కిల్‌లోని అల్లాపూర్, గాజులరామారంలోని జగద్గిరిగుట్ట డివిజన్‌లో 42.94%, గుడిమల్కాపూర్‌లో 49.19%, గోషామహల్ సర్కిల్‌లోని దత్తత్రేయనగర్‌లో 40.86% చొప్పున అత్యధికంగా పోలింగ్ నమోదైంది


Next Story