కరోనా నుంచి కోలుకున్నా ఐసీయూలోనే..

by  |
Corona
X

దిశ, తెలంగాణ బ్యూరో : కరోనా వైరస్​సోకినోళ్లలో కొందరు దారుణమైన పరిస్థితులను చవి చూడాల్సి వస్తున్నది. వ్యాధి తగ్గినా, వైరస్​చేసిన గాయాలు రోజుల తరబడి వేధిస్తున్నాయి. చాలా మంది మూడు, నాలుగు నెలల వరకు బెడ్‌లకే పరిమితం అవుతున్నారు. వీరిలో కొందరు ప్రాణాపాయ స్థితిలోకీ వెళ్తున్నారు. వైరస్​అనంతరం వచ్చిన సమస్యలతో గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల్లోని పోస్టు కొవిడ్​వార్డులు రోగులతో నిండుతున్నాయి. ఒక్కో ఆసుపత్రికి ప్రతి రోజు సగటున వంద నుంచి 150 మంది ఆశ్రయిస్తున్నట్లు అక్కడి​డాక్టర్లు చెబుతున్నారు. అడ్మిట్​ అవుతున్న వారిలో కొందరు ఏకంగా 3 నెలలు వరకు ఆసుపత్రుల్లోనే చికిత్స పొందుతున్నారంటే పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు.

గడిచిన ఏడాది కాలంలో గాంధీలో దాదాపు 200 మందికి పైగా లాంగ్​ టైం పోస్టు కొవిడ్​సమస్యలతో 3 నెలల పాటు ఆసుపత్రుల్లోనే చికిత్స పొందినట్లు డాక్టర్లు తెలిపారు. వీరిలో 85 శాతం మంది ఐసీయూ వార్డులలో ట్రీట్మెంట్​తీసుకున్నట్లు వెల్లడించారు. గరిష్ఠంగా 33 ఏళ్ల సురేష్ అనే వ్యక్తి ఆరు నెలల తర్వాత కోలుకోవడం గమనార్హం. ప్రతి రోజూ కరోనా తర్వాత వచ్చే ఆరోగ్య సమస్యలతో బాధితులు పెరుగుతుండటంతో వైద్యం అందించేందుకు డాక్టర్లు ఛాలెంజ్‌గా తీసుకుంటున్నారు. అన్ని విభాగాల డాక్టర్లు టీంలుగా ఏర్పడి సామూహిక చర్చలు జరుపుతూ చికిత్సను అందిస్తున్నారు. ఒక్కో బాధితుడి సమస్యలను బట్టి ఆయా విభాగాల్లోని వైద్యులు చికిత్స నిర్వహిస్తున్నారు.

క్రిటికల్ స్టేజ్‌లో ఉన్న బాధితులకు అన్నీ సేవలు వైద్యసిబ్బందే చేస్తున్నారు. కొందరికి డైఫర్లు కూడా మార్చాల్సి వస్తుందని వైద్యులు వివరించారు. డాక్టర్లు, నర్సులు, క్షేత్రస్థాయి సిబ్బందిలు నిత్యం రోగుల సేవల్లోనే నిమగ్నమవుతున్నారు. దీంతో పాటు రోజుల తరబడి కోలుకోలేని పేషెంట్ల ఆరోగ్య పరిస్థితిపై వేరే ఆసుపత్రుల్లోని డాక్టర్లతో కూడా సమన్వయం చేసుకుంటున్నారు. వారి సలహాలు, సూచనలను కూడా స్వీకరించి మెరుగైన వైద్యం అందించే చర్యలు చేపడుతున్నారు.

నిర్లక్ష్యం వద్దు…

వైరస్‌తో ఏం కాదులో అనే భ్రమలో ఎక్కువ మంది ఉన్నట్లు గాంధీ డాక్టర్లు చెబుతున్నారు. ఆ భ్రమ నుంచి భయటకు రావాలని సూచిస్తున్నారు. కరోనాను ఎట్టి పరిస్థితుల్లో లైట్​ తీసుకోవద్దని సూచిస్తున్నారు. వైరస్​సోకకుండా మాస్కు, భౌతిక దూరం, శానిటేషన్​ వంటి నిబంధనలు తు.చ తప్పక పాటించాలంటున్నారు. వ్యాక్సిన్​వేసుకున్నా వాటిని కొనసాగించాల్సిందేనని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. లేదంటే సదరు బాధితుల ఆరోగ్యం క్షీణించి నిత్యం సమస్యలతో బాధపడాల్సి వస్తుందని సూచించారు.

ఎప్పుడైనా రావొచ్చు..

కరోనా తగ్గిన తర్వాత కొందరికి నెల రోజుల లోపే ఆరోగ్య సమస్యలు వస్తుండగా, మరి కొందరిలో ఆరు నెలల తర్వాత కూడా తేలుతున్నాయి. అయితే హాస్పిటల్స్​కు వస్తున్న ప్రతి 100లో 80 మందికి కండరాల బలహీనతతో అలసత్వం, నీరసం, వంటి సమస్యలు వస్తుండగా, 20 శాతం మందిలో జ్ఞాపక శక్తి నశించడం, డయేరియా, ఒళ్లు నొప్పులు, శ్వాస సమస్యలు వేధిస్తున్నట్లు గాంధీ, ఉస్మానియా వైద్యులు పేర్కొన్నారు.

కోలుకున్న తర్వాత పాటించాల్సినవి….

కొవిడ్​నుంచి కోలుకున్న తర్వాత మానసిక పరిస్థితిని మెరుగుపర్చుకునేందుకు యోగ, వ్యాయామం వంటివి చేయాలని డాక్టర్లు సూచిస్తున్నారు. కానీ చాలా మంది వ్యాయామం, యోగాలను అతిగా చేయడం వలన కూడా కండరాల బలహీనతతో అలసిపోతున్నారు. దీంతో ఊపిరితిత్తులు, గుండెపై కూడా ప్రభావం పడుతుందని వైద్యులు వివరిస్తున్నారు. అంతేగాక కొందరు రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు ప్రతీ రోజు ఒకే సారి ఐదారు గుడ్లు తింటున్నారని, ఇదీ మంచిది కాదని డాక్టర్లు పేర్కొంటున్నారు. ఇలాంటి వారిలోనే డయేరియా, కడుపునొప్పి, కళ్లు తిరగడం, వాంతులు వంటి సమస్యలు వస్తున్నాయని డాక్టర్లు వివరిస్తున్నారు.

మరి కొందరిలో ఎండోథెలియల్​కణాలు దెబ్బతిని శ్వాస సమస్యలు, ఆయాసం వంటి ప్రాబ్లామ్స్​కూడా వస్తున్నాయి. దీంతో కోలుకున్న తర్వాత కూడా ఇమ్యూనిటీ పెంచుకునేందుకు మంచి ఆహారం తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

ఇదే కారణం..?

కరోనా సెకండ్​వేవ్‌లో స్టెరాయిడ్ల వినియోగం భారీగా పెరిగింది. దాని ప్రభావంతో ప్రస్తుతం కరోనా బాధితుల్లో కొత్త సమస్యలు షురూ అవుతున్నాయి. పేషెంట్లలో వేగంగా కరోనా తీవ్రతను తగ్గించేందుకు అవసరం లేకున్నా, రెమ్​డెసివీర్​యాంటీవైరల్​డ్రగ్‌తో పాటు డెక్సామెథాసోన్, టొసిలోజూమబ్​తదితర స్టెరాయిడ్లను విపరీతంగా వినియోగించారు. కొందరికి ఆక్సిజన్​లెవల్స్​95 ఉన్నా, ఈ మందులను ఇచ్చారు. ఇవి హెవీ డోసులతో కూడినవి కావడంతో తాత్కాలికంగా రోగం తగ్గినా, ఆ డ్రగ్​ప్రభావం ఇతర అవయవాలపై పడుతున్నది. దీంతోనే ప్రస్తుతం పోస్ట్​కొవిడ్ సమస్యలు తేలుతున్నాయి.

ఆశలు వదిలేసిన వారిని బతికిస్తున్నాం..

కరోనా, ఆ తర్వాత వచ్చే ఆరోగ్య సమస్యలతో వచ్చే వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నాం. ప్రైవేట్​ఆసుపత్రులు చేతులెత్తిన కేసులను కూడా పూర్తి స్థాయిలో స్టడీ చేసి ప్రాణాలు కాపాడుతున్నాం. ప్రైవేట్‌లో లక్షలాది రూపాయాలు ఖర్చు పెట్టి, చివరి నిమిషాల్లో గాంధీకి వచ్చిన వారినీ కాపాడినం. ప్రభుత్వాసుపత్రుల్లో భరోసా పెంచే ప్రయత్నం చేస్తున్నాం. అనుభవజ్ఞులైన వైద్యులు కావడంతో రోగులు సులువుగా కోలుకుంటున్నారు. టీం వర్క్‌తో ముందుకు వెళ్తూ రోగులను కాపాడుతున్నాం.
ప్రొఫెసర్ డాక్టర్ రాజరావు, గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్​

ఇమ్యూనిటీ పెంచుకోవాలి

కొవిడ్ నుంచి కొలుకున్న తర్వాత కూడా ఇమ్యూనిటీ పెంచుకునేందుకు సిట్రస్ జాతికి చెందిన పండ్లను ఎక్కువగా తీసుకోవాలి. అంతేగాక స్వల్పపాటి వ్యాయామాలు మాత్రమే చేయాలి. అంతేగాక ఆరు నెలల పాటు ఎప్పటికప్పుడు వైద్యుడి సలహాలు, సూచనలు తీసుకోవాలి. ఈ వైరస్ లంగ్స్ పై ప్రభావం చూపుతున్న నేపథ్యంలో కొలుకున్న తర్వాత కొన్నాళ్ల పాటు మెట్లు ఎక్కడం, బరువులు మోయకపోవడం వంటివి చేయకూడదు.
-డాక్టర్ కిరణ్​మాదాల, క్రిటికల్ హెచ్ఓడీ, నిజామాబాద్​

epaper – MORNING EDITION (22-11-21) చదవండి

Next Story

Most Viewed