గ్రేటర్ లో ముమ్మరంగా రోడ్ల పునర్నిర్మాణం

by  |
గ్రేటర్ లో ముమ్మరంగా రోడ్ల పునర్నిర్మాణం
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల తీవ్రంగా దెబ్బతిన్న రోడ్ల మరమ్మతు పనులను జీహెచ్ఎంసీ ముమ్మరంగా చేపడుతోంది. గ్రేటర్ పరిధిలో దెబ్బతిన్న రోడ్లన్నింటిని పునర్నిర్మించాలని, ప్యాచ్ వర్కులన్నింటినీ యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో దెబ్బతిన్న బీటీ, సీసీ రోడ్ల మరమ్మతుల పనులను వేగంగా చేపడుతున్నారు.

జీహెచ్ఎంసీ నిర్వహించే రోడ్లలో 99 కిలోమీటర్ల రోడ్లను రూ.52కోట్ల వ్యయంతో పునర్నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. దెబ్బతిన్న 83కిలోమీటర్ల రోడ్లలో ప్యాచ్ వర్కులను యుద్ధ ప్రాతిపదికపై చేపడుతున్నారు. సమగ్ర రహదారుల అభివృద్ధి పథకం (సీఆర్ఎంపీ ) కింద 83కిలోమీటర్ల రహదారుల్లో మొదటి లేయర్‌ను వేస్తున్నారు. నగర పరిధిలో 273కిలోమీటర్ల సీసీరోడ్ల నిర్మాణానికి రూ.204.36కోట్లు మంజూరయ్యాయని, వీటికి సంబంధించి 766పనులకు టెండర్ల ప్రక్రియ పురోగతిలో ఉన్నాయని జీహెచ్ఎంసీ ఒక ప్రకటనలో తెలిపింది. రూ.80కోట్లతో సీసీ రోడ్ల పనుల పక్రియను ఇంజినీరింగ్ అధికారులు ప్రారంభించారు.

నగరంలో ఇప్పటికే పెద్ద ఎత్తున చేపట్టిన బాక్స్ డ్రెయిన్ నిర్మాణాలను జీహెచ్ ఎంసీ చేపట్టింది. మరో రూ.298కోట్ల వ్యయంతో అదనంగా బాక్స్ డ్రైయిన్లను చేపట్టేందుకు పరిపాలన సంబంధిత అనుమతులు జారీ చేయడంతో ఈ పనులకు సంబంధించి టెండర్ల ప్రక్రియ పురోగతిలో ఉందని ఇంజినీరింగ్ విభాగం తెలిపింది. హుస్సేన్ సాగర్ సికింద్రాబాద్ మార్గంలో ఉన్న నాలా అసంపూర్తి పనులను రూ.68కోట్లతో చేపట్టనున్నారు. ఇటీవల భారీ వర్షాలకు కూలిపోయిన పాత బస్తీలోని ఆజాంపురా వంతెనకు రూ.3కోట్లను విడుదల చేశారు. గ్రేటర్‌లో ఉన్న చెరువుల్లో 192చెరువులను ఇంజినీర్ల బృందం తనిఖీలు చేసింది. ఆరు చెరువులకు పూర్తిగా గండ్లు పడడంతోపాటు మరికొన్ని పాక్షికంగా దెబ్బతిన్నాయి. వీటన్నిటికీ మరమ్మతులు తక్షణమే చేపట్టేందుకు జీహెచ్ఎంసీ రూ.41కోట్లను ప్రత్యేకంగా విడుదల చేసింది. వీటన్నింటితోపాటు నగరంలోని పాత ప్లైఓవర్లు, బ్రిడ్జిలను కూడా సమగ్రంగా తనిఖీ చేసి మరమ్మతులు చేసేందుకు నీటిపారుదల శాఖ, జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ విభాగం అధికారులు చర్యలు చేపట్టారు.

Next Story

Most Viewed