కేంద్రంతో చర్చలకు సిద్ధమే.. రైతుల కీలక ప్రకటన

by  |
కేంద్రంతో చర్చలకు సిద్ధమే.. రైతుల కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్న రైతులు.. చర్చలకు తాము సిద్ధమేనని ప్రకటించారు. దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో రైతులు పెద్దఎత్తున గుమిగూడితే వైరస్ వ్యాప్తి పెరిగే ప్రమాదం ఉండటంతో ఈ సమస్యను చర్చల ద్వారా పరిష్కరించాలని కేంద్రం నిశ్చయించుకుంది. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్.. చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.

ఈ నేపథ్యంలో భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నాయకుడు రాకేశ్ టికాయత్ స్పందించారు. తామూ చర్చలకు సిద్ధంగా ఉన్నామని, కానీ ఆ చట్టాలను రద్దు చేయడమే ఈ సమస్యకు పరిష్కారమని తేల్చి చెప్పారు. గతంలో చర్చలను ఎక్కడైతే ముగించారో.. అక్కడి నుంచే తిరిగి మొదలుపెడతామని ఆయన వివరించారు. ‘ప్రభుత్వంతో చర్చించడానికి సిద్ధం. మా డిమాండ్లలో మార్పేమీ లేదు. ఆ మూడు నల్ల చట్టాలను రద్దు చేసి.. కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) కల్పించే కొత్త చట్టాన్ని తీసుకురావాలి’ అని టికాయత్ తెలిపారు. మూడు సాగు చట్టాలను రద్దు చేయాలని కోరుతూ నాలుగు నెలలుగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఉద్యమం చేస్తున్న విషయం తెలిసిందే.


Next Story

Most Viewed