డిజిటల్ కరెన్సీపై ఆర్‌బీఐ పనిచేస్తోంది

by  |
డిజిటల్ కరెన్సీపై ఆర్‌బీఐ పనిచేస్తోంది
X

దిశ, వెబ్‌డెస్క్: డిజిటల్ కరెన్సీపై సెంట్రల్ బ్యాంక్ పనిచేస్తోందని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. ఇది క్రిప్టోకరెన్సీ కంటే చాలా భిన్నంగా ఉంటుందన్నారు. సాంకేతిక విప్లవంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) వెనుకబడాలని అనుకోవడంలేదని, బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ప్రయోజనాలను భారీగా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా, క్రిప్టోకరెన్సీలకు సంబంధించి మాకు కొన్ని ఆందోళనలు ఉన్నాయన్నారు. కరోనా అనంతర అవకాశాల గురించి మాట్లాడిన ఆయన.. భారత్ డిజిటల్ విభాగంలో దూసుకెళ్తోందని, డిజిటల్ మౌలిక సదుపాయాలను బలోపేతమవుతోందని చెప్పారు. దేశంలో సుమారు 100 కోట్లకు పైగా వైర్‌లెస్ చందాదారులు ఉన్నారు. అలాగే, 75 కోట్ల మంది ఇంటర్నెట్ చందాదారులతో భారత్ రెండో అతిపెద్ద డిజిటల్ వినియోగదారులను కలిగిన అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో ఒకటని అన్నారు. డిజిటల్ సామర్థ్యాలను మెరుగుపరచడంతో పాటు కనెక్టివిటీ పెరుగుతున్న నేపథ్యంలో సాంకేతిక ఆవిష్కరణలు, సాంకేతిక ఆధారిత అభివృద్ధి దేశ ఆర్థికవ్యవస్థను పూర్తిస్థాయిలో మార్చనుందని దాస్ వెల్లడించారు.

ఇంధన ధరలు తగ్గించకపోతే ద్రవ్యోల్బణం తప్పదు…

దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు భగ్గుమంటున్న సమయంలో, పన్నులను తగ్గించాలని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ సూచించారు. ఇంధన ధరలను తగ్గించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం కలిసి సరైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. బాంబే ఛాంబర్ ఆఫ్ కామర్స్ 185వ వ్యవస్థాపక దినోత్సవం కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఇంధన ధరలు అత్యధికంగా పెరుగుతున్న కారణంగా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదాయ ఒత్తిడికి గురవుతున్నది నిజమే. కరోనా తర్వాతి పరిస్థితుల కారణంగా ఆదాయం, ప్రభుత్వ ఖర్చులు ఉన్నప్పటికీ, పెట్రోల్, డీజిల్‌పై పరోక్ష పన్ను తగ్గించకపోతే మళ్లీ ద్రవ్యోల్బణం ఏర్పడే అవకాశముందని దాస్ వివరించారు. ఇటీవల ద్రవ్యోల్బణం అదుపులోకి వచ్చిందని, అయితే పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో మరికొద్దిరోజుల్లో ఉత్పత్తి, తయారీ రంగాలపై ప్రభావం చూపించే అవకాశం ఉందని దాస్ చెప్పారు. ఇంధన ధరలు లీటర్‌కు రూ. 100కు చేరువకావడంతో వీటిపై ఉన్న పరోక్ష పన్నులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్చించి ధరలను తగ్గించాలని దాస్ స్పష్టం చేశారు. కాగా, ప్రస్తుతం దేశవ్యాప్తంగా రిటైల్ అమ్మకం ధరపైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్‌పై 60 శాతం, డీజిల్‌పై 50 శాతానికిపైగా పన్నులను విధిస్తున్నాయి.

Next Story

Most Viewed