అనీల్ అంబానీకి ఆర్‌బీఐ షాక్!

by  |
anil ambani
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో అత్యంత సంపన్నుడైన ముఖేశ్ అంబానీ సోదరుడు అనిల్ అంబానీకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) షాక్ ఇచ్చింది. అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ క్యాపిటల్ కంపెనీ దివాలా తీసిందని, సంస్థ బోర్డును రద్దు చేస్తున్నట్టు సోమవారం ఆర్‌బీఐ స్పష్టం చేసింది. రుణాలు చెల్లించడంలో కంపెనీ విఫలమైనందునే ఈ చర్యలు తీసుకున్నామని, ప్రాథమిక విచారణలో రిలయన్స్ క్యాపిటల్ నిర్వహణలో అనేక తప్పిదాలను గుర్తించామని ఆర్‌బీఐ పేర్కొంది. కంపెనీ తన బాధ్యతలను నిర్వర్తించడంలో విఫలం అయినందున రిలయన్స్ క్యాపిటల్ అడ్మినిస్ట్రేటర్‌గా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వై నాగేశ్వరరావును నియమిస్తూ ఆర్‌బీఐ నిర్ణయించింది.

ఆర్‌బీఐ చట్టం-1934 ఆధారంగా రిలయన్స్ క్యాపిటల్ బోర్డు అధికారాలను స్వాధీనం చేసుకున్నామని, దివాలా చట్టం కింద కంపెనీపై ఆర్‌బీఐ త్వరలో చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేసింది. రిలయన్స్ క్యాపిటల్ కంపెనీ గతేడాది హౌసింగ్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్(హెచ్‌డీఎఫ్‌సీ), యాక్సిస్ బ్యాంక్ నుంచి రూ. 624 కోట్ల విలువైన రుణలు తీసుకుని వడ్డీని చెల్లించలేదని ఆర్‌బీఐ తెలిపింది. అక్టోబర్ 31 నాటికి హెచ్‌డీఎఫ్‌సీకి రూ. 4.77 కోట్లు, యాక్సిస్ బ్యాంకుకు రూ. 71 లక్షలను వడ్డీ చెల్లించడంలో విఫలమైంది. రిలయన్స్ క్యాపిటల్ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ నుంచి 6 నెలల నుంచి 7 ఏళ్ల కాలానికి 10.6-13 శాతం, యాక్సిస్ బ్యాంక్ నుంచి 3-7 ఏళ్ల కాలానికి 8.25 శాతం టర్మ్ లోన్ తీసుకుంది. చెల్లింపుల విషయంలో చేసిన పొరపాట్ల వల్ల తాజా నిర్ణయం తీసుకున్నట్టు ఆర్‌బీఐ వెల్లడించింది.


Next Story