ఆర్థిక లోటును తీర్చేందుకు కరెన్సీ ప్రింటింగ్ పరిష్కారం కాదు

by  |
ఆర్థిక లోటును తీర్చేందుకు కరెన్సీ ప్రింటింగ్ పరిష్కారం కాదు
X

దిశ, వెబ్‌డెస్క్ : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) ఆర్థిక లోటును తీర్చేందుకు నగదును ముద్రించకూడదని ప్రముఖ ఆర్థికవేత్త పినాకి చక్రబొర్తి అన్నారు. కొవిడ్ మహమ్మారి మూడో వేవ్ పరిస్థితులు లేకపోతే భారత్ అత్యంత వేగంగా ఆర్థిక పునరుద్ధరణను సాధిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ(ఎన్ఐపీఎఫ్‌పీ) డైరెక్టర్‌గా ఉన్న పినాకి చక్రబొర్తి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అధిక ద్రవ్యోల్బణం ఖచ్చితంగా ఆందోళన కలిగించే విషయమని, ఈ సవాలుని అధిగమించాలని ఆయన అభిప్రాయపడ్డారు.

కరోనా మహమ్మారి తర్వాత దీని గురించి చర్చ ప్రారంభమైందని, ద్రవ్యలోటును భర్తి చేసేందుకు డబ్బును ముద్రించడం సరైన పరిష్కారంగా భావించడం లేదని, ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంటుందని అనుకోవట్లేదని ఆయన వివరించారు. గతేడాది కరోనా ప్రారంభం అయ్యాక ఉన్న పరిస్థితుల కంటే భారత్ ప్రస్తుతం మెరుగైన స్థూల ఆర్థిక పరిస్థితుల్లో ఉందని పినాకి చక్రబొర్తి స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో మూడో వేవ్ లేకపోతే ఆర్థిక పునరుద్ధరణ వేగంగా ఉంటుందన్నారు. అలాగే, ఉపాధి కోల్పోయిన పరిణామాల నుంచి బయటపడాలంటే వేగంగా రికవరీ సాధించడం ఎంతో కీలకమని ఆయన తెలిపారు. ఆర్థిక చర్యల ద్వారా తక్కువ కాలంలో కొంతమేరకు జీవనోపాధి భద్రతను కల్పించవచ్చని ఆయన వెల్లడించారు.


Next Story

Most Viewed