ఈసారి కూడా వడ్డీ రేట్లు యథాతథమే

by  |
ఈసారి కూడా వడ్డీ రేట్లు యథాతథమే
X

దిశ, వెబ్‌డెస్క్: ద్రవ్యోల్బణం అధికంగా ఉండటం, ఆర్థికవ్యవస్థ అనిశ్చితి నేపథ్యంలో ఈ వారం జరిగే ఆర్‌బీఐ ద్రవ్య ద్రవ్య విధాన కమిటీ(ఎంపీసీ) సమీక్షలో ప్రస్తుత ఉన్న వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. జూన్ 2-4 వరకు జరిగే సమావేశంలో కమిటీ నిర్ణయాలను జూన్ 4న ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించనున్నారు. ప్రస్తుతం రెపో రేటు 4 శాతం వద్ద, రివర్స్ రెపో రేటు 3.35 శాతం వద్ద ఉంది. చివరిగా గతేడాది మేలో ఆర్‌బీఐ రెపో, రివర్స్ రెపో రేట్లను సవరించిన సంగతి తెలిసిందే.

ఏప్రిల్‌లో జరిగిన విధాన సమీక్షలోనూ వడ్డీ రేట్లలో మార్పు చేయలేదు.’ఆర్థికవ్యవస్థలో పూర్తిస్థాయి కార్యకలాపాలను ఇంకా తెరవలేదు. కరోనా టీకా అంశంపై అనిశ్చితి కొనసాగుతోంది. ఈ క్రమంలో ఆర్‌బీఐ సర్దుబాటు వైఖరిని కొనసాగించేందుకే మొగ్గు చూపుతుందని’ నారెడ్కో జాతీయ అధ్యక్షుడు నిరంజర్ హీరానందాని చెప్పారు. కరోనా సెకెండ్ వేవ్ వల్ల ఆర్థికవ్యవస్థ కోలుకునే దశలో మరోసారి దెబ్బతిన్నదని, దీంతో వ్యవస్థలోకి ద్రవ్య లభ్యతను పెంచాల్సిన అవసరం ఉందని నిరంజన్ తెలిపారు. మరీ ముఖ్యంగా కరోనాతో అధికంగా దెబ్బతిన్న రంగాలకు ద్రవ్య లభ్యత ఎంతో కీలకంగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ‘దేశంలో టీకా పంపిణీ గణనీయంగా మెరుగుపడే వరకు ఎంపీసీ నిర్ణయాలు స్థిరంగా కొనసాగవచ్చని భావిస్తున్నట్టు’ ఇక్రా చీఫ్ ఎకనమిస్ట్ అదితి నాయర్ వెల్లడించారు.


Next Story