ఇండియాపైనే టార్గెట్ ఎందుకు?

by  |
ఇండియాపైనే టార్గెట్ ఎందుకు?
X

న్యూఢిల్లీ: ఇజ్రాయెల్‌ సంస్థ ఎన్ఎస్‌వో అభివృద్ధి చేసిన స్పైవేర్ పెగాసెస్‌ను సుమారు 45 దేశాలు వినియోగిస్తున్నాయని, అలాంటప్పుడు కేవలం భారత్‌నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారని కేంద్ర మాజీ ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ప్రశ్నించారు. పెగాసెస్ స్పైవేర్‌ను ఎక్కువగా పాశ్చాత్య దేశాలకే అమ్ముకుంటోందని ఎన్ఎస్‌వోనే వెల్లడించినప్పటికీ ఈ విషయంలో భారత్‌నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారన్నారు. ఈ కథ వెనుక మతలబేమిటని అడిగారు. కొంతమంది పార్లమెంటు సమావేశాలకు ముందే సెన్సేషనల్ న్యూస్‌ల కోసం ప్రయత్నించారని, వాతావరణమంతా గందరగోళంగా మార్చాలనుకున్నారని ఆరోపించారు.

అందులో భాగంగానే ఈ రిపోర్టులను ఇక్కడ హైలైట్ చేస్తున్నారని పేర్కొన్నారు. పెగాసెస్ దాడికి గురైన ఇండియా, అబ్రాడ్ దేశాల్లోని జర్నలిస్టుల జాబితాను విడుదల చేసిన అంతర్జాతీయ సంస్థ ఆమ్నెస్టీపైనా వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు. ఆమ్నెస్టీలాంటి సంస్థలు భారత వ్యతిరేక అజెండా కలిగి ఉంటాయన్న విషయాన్ని ఖండించగలమా? అని ప్రశ్నించారు. అసలు, పెగాసెస్ స్పైవేర్‌కు కేంద్ర ప్రభుత్వం, బీజేపీకి సంబంధమే లేదని కొట్టిపారేశారు. ఇదంతా డిజిటల్ వ్యవహారమే కాబట్టి, కనీసం ఒక్క డాక్యుమెంట్ అయినా ఆధారంగా చూపించగలరా? అని అడిగారు. ఇదంతా ప్రతిపక్షాలు కావాలనే పార్లమెంటు సమావేశాలకు ముందు చేసిన కుట్ర అని ఆరోపించారు.

తమ స్పైవేర్‌‌ను ప్రభుత్వాలు, ప్రభుత్వ ఏజెన్సీలకే విక్రయిస్తామని ఎన్ఎస్‌వో సంస్థ 2019లో పేర్కొన్న తర్వాతే కేంద్ర ప్రభుత్వంపై అనుమానాలు పెరిగాయి. 2019లోనూ పెగాసెస్ వైరస్ తమ యూజర్ల ప్రైవసీపై దాడి చేసిందని వాట్సాప్ ఆరోపించింది. పౌరుల ప్రాథమిక హక్కును కాపాడటానికి కేంద్రం కట్టుబడి ఉన్నదని అప్పటి కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు.


Next Story