దొరికినవారే దొంగలైతే మరి చేయించినవారు?

by  |
దొరికినవారే దొంగలైతే మరి చేయించినవారు?
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: దొరికితేనే దొంగ అన్నచందంగా సాగుతోంది రేషన్ బియ్యం స్మగ్లింగ్. మహారాష్ట్రలో దొడ్డు బియ్యం తరలింపునకు ఆంక్షలు లేకపోవడంతో తెలంగాణ బార్డర్ దాటితే చాలు అన్నట్లు దందా సాగుతోంది. ఇందుకోసం సరిహద్దుల్లో ఏజెంట్లను సైతం నియమించుకున్నట్లు తెలుస్తోంది. పోలీసుల తనిఖీల్లో పట్టుబడినా డ్రైవర్లు, వర్కర్లపై మాత్రమే కేసులు పెట్టడంతో అక్రమ వ్యాపారులకు అడ్డూ అదపూ లేకుండా పోతోంది.

మహారాష్ట్ర చట్టాలే కాదు, తెలంగాణ విచారణ తీరు కూడా స్మగ్లింగ్‌కు సహకరిస్తున్నదనే ఆరోపణలు ఉన్నాయి. మూల కారకులను పట్టించుకోకుండానే తరలింపునకు పాల్పడుతున్న వారిని అరెస్ట్ చేస్తున్నారని పలువురు మండిపడుతున్నారు. దీంతో ప్రతి నెలా టన్నుల కొద్దీ బియ్యం మహారాష్ట్రకు దర్జాగా తరలుతోంది.

నామమాత్రంగానే..

తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి రేషన్‌ బియ్యాన్ని తరలిస్తున్న వాహనాల డ్రైవర్లు, కూలీలపై మాత్రమే పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారని, దాని వెనకాల ఉన్నవారిని పట్టించుకోవట్లేదనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో రేషన్ బియ్యం కొనుగోలు చేసేందుకు పెట్టుబడులు పెడుతూ రూ. కోట్లు టర్నోవర్ చేస్తున్న వారు మాత్రం తప్పించుకుని తిరుగుతున్నారు.

ఒకటి రెండు సార్లు మాత్రం తెలంగాణకు చెందిన రేషన్ బియ్యం స్మగ్లింగ్ చేస్తున్న వ్యాపారులపై కేసులు నమోదు చేశారు తప్ప.. చాలా కేసుల్లో చిరుద్యోగులతోనే సరిపెటుడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడి రేషన్ బియ్యంతో మహారాష్ట్రలో దందా కొనసాగిస్తున్న బడా వ్యాపారులకు తెలంగాణ చట్టాలు చుట్టాలుగా మారాయనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మహారాష్ట్రలో దొడ్డు బియ్యంపై నియంత్రణ లేకపోవడంతో ఇక్కడి నుంచి దర్జాగా రేషన్ బియ్యం తరలుతోంది.

ఏజెంట్లే కీలకం..

మహారాష్ట్రలో దొడ్డు బియ్యం దందా చేస్తున్న వ్యాపారులకు సరిహద్దు ప్రాంతంలోని కొంతమంది ఏజెంట్ల అవతారం ఎత్తినట్లు.. నిత్యం బియ్యం సరఫరా చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. స్థానికంగా రాజకీయ పలుకుబడి ఉన్న వారు కూడా సబ్సిడీ బియ్యాన్ని సరిహద్దులు దాటించడంలో తమవంతు సాయం అందిస్తున్నారని సమాచారం. దీంతో పోలీసులు రేషన్ బియ్యాన్ని పట్టుకున్నప్పుడు లొతుగా దర్యాప్తు చేయడం లేదన్న చర్చ సాగుతోంది.

Next Story

Most Viewed