సన్న బియ్యం ఇయ్యరాయే..దొడ్డు బియ్యం వ్యాపారమాయే..!

by  |
సన్న బియ్యం ఇయ్యరాయే..దొడ్డు బియ్యం వ్యాపారమాయే..!
X

దిశ, మొగుళ్లపల్లి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెల్లరేషన్ కార్డులకు సన్నబియ్యం ఇవ్వకపోవడం.. దొడ్డు బియ్యం సరఫరా చేస్తుండటంతో అక్రమ వ్యాపారులు వాటిని ఖరీదు చేసి తెలంగాణ రాష్ట్రం నుంచి మహారాష్ట్రకు సరఫరా చేస్తున్నారు. ప్రభుత్వం అందించే దొడ్డు రకం బియ్యం ఖరీదు కూడా సన్న రకం అందించే స్థితిలో ఉండగా.. తెల్లరేషన్ కార్డు లబ్ధిదారులకు ఎందుకు సన్న రకాలు ఇవ్వడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. దొడ్డు బియ్యం అందించడం వలన వాటిని ఇతరులకు విక్రయించి సన్నబియ్యం కొనుక్కుంటున్నారు.

అక్రమంగా ఖరీదు చేసుకున్న వారు ఈ దొడ్డు రకం బియ్యాన్ని ఇతర రాష్ట్రాలకు తరలించి కోట్లాది రూపాయలు సంపాదించుకుంటున్నారు. ఈ దందా మొత్తం అధికారుల అండదండలతోనే కొనసాగుతుండటం గమనార్హం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం ఒక గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు బియ్యం మాఫియా డాన్ లుగా ఏర్పడి, మండలాలను సెలెక్ట్ చేసుకొని , ఎవరి మండలాల్లో వారి ఏజెంట్లను పెట్టుకొని గ్రామాల వారిగా బియ్యాన్ని కొనుగోలు చేసి, యథేచ్ఛగా అధికారుల కనుసన్నల్లోనే డంపింగ్ చేసి, వ్యాన్లలో మహారాష్ట్రకి తరలించి కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారు.

ఈ తతంగమంతా అధికారుల కనుసన్నల్లోనే జరుగుతుందని సమాచారం. తెలంగాణ సొమ్మును మహారాష్ట్రకు తరలిస్తున్న సంబంధిత అధికారులు ఏం చేస్తున్నారని, బియ్యం మాఫియా డాన్ లపై కేసులు ఎందుకు పెట్టడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ బియ్యం మాఫియా డాన్ లకు సహకరిస్తున్నదెవరని, ఇంతటి సహకారం ఎక్కడిదని, ఈ తతంగం వెనుక స్థానిక ప్రజాప్రతినిధుల అండదండలున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బియ్యం మాఫియా డాన్ లు పర్సంటేజీల వారీగా ముడుపులు చెల్లిస్తున్నట్లు సమాచారం. అందుకే వారి నీడన పీడీఎఫ్ బియ్యం యథేచ్ఛగా తెలంగాణ నుంచి మహారాష్ట్రకు తరలిస్తున్నట్లు సమాచారం.

Next Story

Most Viewed