పేరుకే సన్న బియ్యం.. ఇచ్చేది సగమే!

by  |
ration dealers bribe danda in suryapet
X

దిశ, సూర్యాపేట : తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజల కడుపు నింపడానికి అందిస్తున్న రేషన్ బియ్యం పక్కదారి పడుతోంది. అక్రమార్జనకు అలవాటు పడిన కొందరు రేషన్ డీలర్లు నయా దందాకు తెరలేపారు. ప్రభుత్వం పేదలకు అందిస్తున్న సన్న బియ్యాన్ని కార్డుదారులకు సగమే పంపిణీ చేస్తూ మిగతా సగాన్ని అక్రమంగా అమ్ముకుని తమ జేబులు నింపుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా సివిల్ సప్లై, రెవెన్యూ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రేషన్ బియ్యాన్ని కొందరు మిల్లర్లు తమ మిల్లులకు అక్రమార్కుల ద్వారా తరలించుకుని వాటినే సన్నబియ్యంగా మార్చి, బయట సాంబమసూరి అని చెబుతూ ప్రజలను మోసం చేస్తున్నారు. అంతేకాకుండా ఈ ధాన్యాన్నే ఇతర రాష్ట్రాలకు సైతం తరలిస్తున్నారు. జిల్లాలో కొంతమంది పోలీసు అధికారులు అక్రమ బియ్యం దందాకు సహకరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.

ఈ దందాలో ఆరితేరిన పెన్‌పహాడ్ మండలానికి చెందిన ఓ బియ్యం వ్యాపారి ఇప్పటికే పెద్ద ఎత్తున దందాలు చేస్తూ పోలీసులకు భారీగా ముడుపులు అప్పజెప్పుతున్నట్లు తెలుస్తోంది. పోలీస్ డిపార్ట్‌మెంట్లో పలువురు అధికారులను పరిచయం చేసుకుని అక్రమ బియ్యం దందాను మరిన్ని రాష్ట్రాలకు విస్తరించించినట్లు వినికిడి. ఎంతో మందిని పట్టుకున్న పోలీసులు ఇతన్ని మాత్రం ఇప్పటివరకు ఎందుకు పట్టుకోలేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇతనితో పాటు సూర్యాపేటలో ఓ కిరాణా వ్యాపారి, మునగాల మండల కేంద్రానికి చెందిన పలువురు వ్యాపారులు, చివ్వేంల మండలంలోని తండాకు చెందిన ఇద్దరు వ్యాపారులు, సూర్యాపేట జిల్లా కేంద్రంలోని రెండు వార్డుల్లో ఉన్న వ్యాపారులు అక్రమంగా రేషన్ బియ్యాన్ని అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. మెల్లచేరువు, మట్టంపల్లి, అనంతగిరి, కోదాడ, నాగరాం, తిరుమల గిరి, మండలాల్లో ఆంధ్రా ప్రాంతానికి చెందిన వ్యాపారులు ఈ ప్రాంతాల్లో అధికంగా వ్యాపారం చేస్తూ ఇక్కడ పనిచేస్తున్న కొందరు పోలీస్, ఇతర శాఖల అధికారులను మచ్చిక చేసుకొని రూ.లక్షల్లో డబ్బులు దండుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి.

అధికంగా జిల్లా కేంద్రంలోని డీలర్లే..

రేషన్ దందాలో జిల్లాలోని పలు తండాలకు చెందిన డీలర్లతో పాటు సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన పలువురు డీలర్లు ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. వీరు అక్రమార్కుల అండదండలతో కార్డు దారులకు సగమే సన్న బియ్యం ఇస్తూ, దొడ్డు బియ్యాన్ని అమ్ముకుంటున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యహరించడం విశేషం.

కోళ్ల దానాకు కూడా..

రేషన్ బియ్యాన్ని అక్రమార్కులు పలు రకాలుగా వాడుతున్నారు. మిల్లర్లకు తరలించి సన్నబియ్యంగా మార్చి అధిక ధరలకు అమ్ముకోవడమే గాక ఇతర రాష్టలకు తరలించడంతో పాటు నూకగా మార్చి కోళ్లఫారాలకు తరలిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి బియ్యం అక్రమ రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. అలాగే, కార్డు దారులకు సగం బియ్యం ఇస్తున్న డీలర్లపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

చర్యలు తీసుకుంటాం..

రేషన్ కార్డు దారులను మోసం చేస్తూ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకుంటాం.. ఇప్పటి వరకు మా దృష్టికి రాలేదు.. త్వరలోనే ఆకస్మిక తనిఖీలు చేపట్టి వారి భరతం పడతాం.

-డీఎస్ఓ విజయలక్ష్మీ


Next Story

Most Viewed